38కి పడిపోయిన కాంగ్రెస్ బలం
న్యూఢిల్లీ : రాజ్యసభలో ఎన్డిఎ బలం అమాంతం పెరిగింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 9 మంది సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాజ్యసభలో ఆ కూటమి బలం 100 దాటి 104కు చేరింది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ సభ్యుల సంఖ్య అత్యల్పంగా 38కి పడిపోయింది. తాజా విజయాలతో రాజ్యసభలో బిజెపి సభ్యుల సంఖ్య 92కి చేరింది. మిత్రపక్షం జెడి(యు)కి ఎగువ సభలో ఐదుగురు సభ్యులున్నారు. వీరు కాకుండా, మిత్రపక్షాలు అర్పిఐ అథవాలే, అసోం గణపరిషత్, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, పిఎంకె, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్లకు ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ సభ్యులున్నారు. దీంతో ఎగువ సభలో ఎన్డిఎ బలం 104కి చేరింది. ఇవి కాకుండా, నలుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతు కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. అలాగే, కీలక బిల్లుల ఆమోదానికి, అవసరమైనప్పుడు అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నాడిఎంకెకు 9 మంది, బిజెడికి 9 మంది సభ్యులు ఉన్నారు. ఇన్నాళ్లు రాజ్యసభలో కీలక, ప్రతిష్టాత్మక బిల్లుల ఆమోదానికి ఇబ్బంది పడిన ప్రభుత్వానికి తాజా విజయాలతో ఆ అవసరం రాకపోవచ్చు.