మనతెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్లో బెట్టింగ్ కట్టి అప్పులపాలైన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని పంజాగుట్టలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… జార్ఖండ్, డియోరి, బాస్మండికి చెందిన సోనూ కుమార్ యాదవ్(19) నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి పంజాగుట్ట, ద్వారకాపురి కాలనీలో కొబ్బరి బోండాలు విక్రయిస్తున్నాడు. మరో ఇద్దరు స్నేహితులు సంజయ్ యాదవ్, మనోజ్తో కలిసి రూములో ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ కడుతున్నాడు. బెట్టింగ్లో డబ్బులు పోవడంతో అప్పులు తీసుకువచ్చి బెట్టింగ్ కడుతున్నాడు. ఈ క్రమంలోనే అప్పులు ఎక్కువ కావడంతో రూములోని స్నేహితులు ఉద్యోగానికి వెళ్లగానే వాష్ రూమ్లోని గ్రిల్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి సోదరుడికి విషయం తెలియడంతో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.
Youth Suicide after loss in Cricket betting in Punjagutta