వనపర్తి: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ , రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం అన్లోడ్ సమయంలో మిల్లర్లు తరుగు తీసి తీసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. శనగల కొనుగోళ్లలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైతే ప్రైవేటు గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు తీసుకోవాలని సూచించారు. ఖరీఫ్కు అవసరమైన ఎరువులు, విత్తనాలపై ప్రణాళిక రూపొందించుకోవాలని, ఎరువులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా మాచినేనిపల్లి దగ్గర మామిడి హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేశామని, కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 928కి చేరుకోగా 23 మంది మృత్యువాత పడ్డారు.