న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలలో కోతల ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత కరోనా లాక్డౌన్ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పింఛన్దార్లపై కోతల భారం పడింది. ఉద్యోగుల వేతనాలలో కోతల గురించి వచ్చిన వార్తలను ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం ఖండించింది. వేతనాల్లో 30 శాతం మేర కోతలు ఉంటాయని పలు వార్తా ఛానళ్లు తెలియచేస్తున్నాయని, అయితే ఇందులో నిజం లేదని అధికారిక వివరణ ఇచ్చారు.
ఉన్నత స్థాయి ఉద్యోగుకు కోతలు ఉంటాయని, అయితే కింది స్థాయి వారికి, కాంట్రాక్టు ఉద్యోగులకు ఇబ్బంది ఉండదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఏ స్థాయి ఉద్యోగులకూ అయినా వేతనాలలో కోతల ఆలోచన ఏదీ లేదని, పరిశీలనకు కూడా రాలేదని మంత్రిత్వశాఖ అధికారికంగా ట్వీట్ చేసింది. మీడియాలో వస్తున్న వార్తలకు ఎటువంటి ప్రాతిపదిక లేదని, కేవలం వీటిని ఊహాగానాలుగా పరిగణించవచ్చునని తెలిపారు. లాక్డౌన్ సడలింపుల దశలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం దేశ రాజధానిలోని తమ కార్యాలయానికి విధుల నిర్వహణకు వచ్చారు.
No Cuts in Salary for Central Employees: Finance Ministry