Monday, April 29, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 46శాతంగా ఉన్న డిఎ 50 శా తానికి చేరుకుంటుంది. 2024 జనవరి 1నుంచే ఈ పెంపు అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తాజా నిర్ణయంతో కోటి మందికి పై గా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ స మావేశంలో ఈ మేరకు నిర్ణయం తీ సుకున్నట్లు సమావేశం అనంతరం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మీడియాకు చెప్పారు. డిఎ, పెన్షనర్ల డిఆర్ పెంపు కారణంగా 202425 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఖజానాపై రూ.15,014 కోట్ల మేర భారం పడనుంది. డిఎ పెంపుతో పాటుగా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్ లాంటి ఇతర అలవెన్సులను కూడా 25 శాతం పెంచారు. ఇంటి అద్దె అలవెన్స్( హెచ్‌ఆర్ అలవెన్స్)ను కూడా బేసిక్ వేతనంలో ఇప్పుడున్న 27 శాతం, 19 శాతం, 9 శాతంనుంచి 30 శాతం, 20 శాతం, 10 శాతానికి పెంచారు. అలాగే గ్రా ట్యుటీ ప్రయోజనాల సీలింగ్‌ను కూడా ఇప్పుడున్న రూ.20 లక్షలనుంచి రూ.25 లక్షలకు పెంచారు.వివిధ అలవెన్సుల పెంపు భారం ఏటా రూ.9,400 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.
మరో ఏడాది పాటు రూ.300 ఉజ్వల గ్యాస్ సబ్సిడీ
కాగా, ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న రాయితీని మరో ఏడాది పాటు పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది.ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌పై వీరికి రూ.300 రాయితీ లభిస్తోంది. ఈ ఏడాది మార్చితో ఈ రాయితీ గడువు ముగియనుంది. అయితే ఏప్రిల్‌నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ రాయితీని వర్తింప జేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏడాదికి 12సిలిండర్ల వరకు ఈ రాయితీ లభిస్తుంది. రాయితీ పొడిగింపుతో 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని పీయూష్ గోయల్ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.12 వేల కోట్ల భారం పడనుందని చెప్పారు. 2006లో ప్రారంభించిన ఉజ్వల పథకం కింద పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ లభించనుండగా, సిలిండర్‌ను మాత్రం మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 2022లో ఉజ్వల పథకం కింద కనెక్షన్ తీసుకున్న వారికి ఒక్కో సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌లో సబ్సిడీ మొత్తాన్ని రూ.300కు పెంచింది. ప్రస్తుతం ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.903గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు రూ.603కే లభిస్తుంది.
జనపనార కనీస మద్దతు ధర పెంపు
కాగా 2024 25సీజన్‌కుజనపనార కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)ని క్వింటాల్‌కు రూ.285 పెంచుతూ మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో క్వింటాల్ ముడి జనుము కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5,335కు చేరుకుంటుంది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, దీనివల్ల తూర్పు రాష్ట్రాలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే అయిదేళ్ల పాటు రూ.10,372 కోట్ల వ్యయంతో ఇండియా ఎఐ మిషన్ పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో పెద్దెత్తున కంప్యూటింగ్ మౌలిక వసతులను కల్పించడం కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారని పీయూష్ గోయల్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News