న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల వెంబడి గడచిన ఆరు నెలల్లో ఎటువంటి చొరబాట్లు జరగలేదని కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో సభ్యుడు డాక్టర్ అనిల్ అగర్వాల్ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిస్తూ గడచిన ఆరు నెలల్లో భారత్-చైనా సరిహద్దుల వెంబడి చొరబాట్లు జరిగినట్లు తెలియరాలేదని తెలిపారు. అయితే ఆయన దీనిపై తదుపరి వివరణ ఇవ్వలేదు.
కాగా.. గత, మే నుంచి తూర్పు లడఖ్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, భారత సైనిక దళాలకు మధ్య తలెత్తిన ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో రాజ్యసభలో హోంశాఖ సహాయ మంత్రి చైనా నుంచి చొరబాట్లు ఏవీ చోటుచేసుకోలేదని ఇచ్చిన సమాధానం వివాదాలకు దారితీసింది. చొరబాట్లు ఏవీ జరగని పక్షంలో ఈ ఏడాది ఏప్రిల్ ముందు నాటి యథాపూర్వ స్థితిని పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం చైనాతో జరుపుతున్న దౌత్యపరమైన, సైనికపరమైన చర్చలలో ఎందుకు పట్టుబడు తోందన్న ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. దీనిపై హోంశాఖ అధికారులు వివరణ ఇస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనతో నిత్యానంద్ రాయ్ ప్రకటన విభేదించినట్లు కాదని చెప్పారు. చొరబాటు అనే పదాన్ని ఉగ్రవాదులు లేదా శత్రు మూకలు మన సరిహద్దుల్లోకి చొరబడినపుడు ఉపయోగించడం జరుగుతుందని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ కూడా మంగళవారం లోక్సభలో మాట్లాడుతూ మన సరిహద్దులోకి ప్రవేశించడానికి చైనా బలగాలు ప్రయత్నించిన విషయాన్ని ప్రస్తావించారని అధికారులు గుర్తు చేశారు.
No Infiltrations from China in last 6 months: Center