Saturday, April 27, 2024

లోక్‌సభ ముందస్తు ఎన్నికల మాటే లేదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభకు ముందస్తు ఎన్నికల ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఆదివారంఆయన ఓ వార్తాసంస్థకు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. నిర్ణీతం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. తేదీలను ముందుకు జరిపే ప్రసక్తే లేదని, ప్రధాని మోడీ దేశ ప్రజలకు తమ పదవికాలపు చివరి రోజు వరకూ సేవలు అందిస్తూ ఉంటారని ఠాకూర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను ముందుకు కానీ లేదా వెనకకు కానీ జరిపి నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోందని, అయితే ఇదంతా కూడా మీడియా ద్వారా వెలువడ్డ సృష్టి అని, లేనిది ఉన్నట్లు చూపడం అని మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల దశలు ఏవీ మారబోవని, అసెంబ్లీలకు ఎన్నికలను వాయిదా వేసి వీటిని లోక్‌సభ ఎన్నికలతో కలిపి వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో నిర్వహిస్తారని, లేదా లోక్‌సభ ఎన్నికలను ఇప్పటి అంటే ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి జరుపుతారనే వార్తలు వెలువడుతున్నాయి.

ఈ వార్తలు తమ దృష్టికి వచ్చాయని అయితే ఇటువంటి ఆలోచన ఏదీ లేదని ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వూలో మంత్రి వివరించారు. ఎన్నికలపై ముందుకు వెనుకల ఊగిసలాటల అవసరం మోడీజికి లేదన్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ఆలోచన ఏదీ లేదన్నారు. మీడియా ఊహాగానాల ఫలితంగానే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.మరి కేంద్రం ఈ దశలోనే ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ ప్రతిపాదన దీనికి సంబంధించి కమిటీ తీసుకువచ్చింది కదా అని మీడియా ప్రశ్నించగా , దీనిపై సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటితో విస్తృత స్థాయి సంప్రదింపులు ఉంటాయని , ఇందుకే కమిటీ ఏర్పాటు అయిందని మంత్రి తెలిపారు. ఈ కమిటీలో కాంగ్రెస్ సభా పక్ష నేత అధీర్ రంజన్ కూడా పాలుపంచుకోవాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఆయన పేరును కూడా కమిటీలో చేర్చారని గుర్తు చేశారు. ప్రతిపక్షాన్ని కూడా కమిటీలో చేర్చడం మోడీ ప్రభుత్వ పెద్ద మనస్సు అన్నారు.

ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురిచి ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆలోచనలు ఉన్నాయని తెలిపిన కేంద్ర మంత్రి ఈ సెషన్ అజెండా ఏమిటనేది వివరించలేదు. సంబంధిత చర్చనీయాంశం ఏమిటనేది అవసరం అయినప్పుడు సముచిత సందర్భంలో తెలియచేయడం జరుగుతుందని ఠాకూర్ దాటేశారు. అయినా దీని గురించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తెలియచేస్తారని చెప్పారు. ప్రత్యేక భేటీకి తేదీలు ఖరారు అయ్యాయి. అజెండాను త్వరలో తెలియచేసే వీలుందన్నారు. దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆలోచిస్తోందని , లోక్‌సభ ముందస్తు కానీ , అసెంబ్లీ ఎన్నికల వాయిదా కానీ జరుగుతుందని మీడియాలో జోరుగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై మంత్రి స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News