2020 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించిన ఒక్కో అప్డేట్ వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎమోషనల్ కంటెంట్ ఏమాత్రం తగ్గకుండా సినిమా ఆద్యంతం రంజింపజేసేందుకు తనదైన ఎత్తుగడలను అనుసరిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏకంగా త్రిపాత్రాభినయంతో అదరగొడతాడని తెలిసింది. ఈ మూడు పాత్రలు దేనికవే ప్రత్యేకంగా ఉండి సినిమాలో హైలైట్గా నిలుస్తాయని టాక్.
ఒక్కో పాత్రలో ఒక్కో షేడ్ ఆద్యంతం రక్తి కట్టిస్తుందని తెలిసింది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమురం భీమ్గా తారక్ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆంగ్లేయులపై పోరాటం సాగించే ఫిక్షన్ కథాంశాన్ని జక్కన్న పూర్తి కమర్షియల్ హంగులతో విజువల్ వండర్గా ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. అందుకోసం నిర్మాత డివివి దానయ్య దాదాపు 300 కోట్ల బడ్జెట్ని వెచ్చిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇప్పటికే 80 శాతం మేర షూటింగ్ పూర్తయింది. తారక్పై మరిన్ని భారీ సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉంటుందట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.