Monday, April 29, 2024

ఆధార్ కేంద్రాల సంఖ్యను తక్షణమే పెంచాలి : తమ్మినేని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు, ఇతరత్రా అవసరాలకు, ఇటీవల ‘అభయహస్తం’ పథకానికి అధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో ‘మీసేవా కేంద్రాల’ వద్ద విపరీతంగా రద్దీ పెరిగిందని, గడువులోగా తమ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారని, అందువల్ల ఆధార్ కేంద్రాలను పెంచి, ప్రజలకు ఉపశమనం కల్పించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

కెవైసి అనుసంధానం, అడ్రస్ మార్పు, పేరులో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రజలు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళాలన్నారు. ఆన్‌లైన్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తగిన అవగాహన లేకపోవడంతో పాటు సాంకేతిక సమస్యలతో సవరణలను చేసుకోవడం సాధ్యం కావడం లేదని తెలిపారు. గతంలో వేల సంఖ్యలో ఉన్న కేంద్రాలు భారీగా తగ్గి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 350 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జిల్లాలలో సరిపడా కేంద్రాలు లేకపోవడంతో గత 15 రోజుల నుండి ప్రజలు పనులు మానుకుని టోకెన్ల కోసం తెల్లవారు జాము నుండే పడి గాపులు పడుతున్నారన్నారు. వృద్ధులు, మహిళలు చిన్నారులతో క్యూలైన్లలో ఉండాల్సివస్తున్నదని తెలిపారు. కొన్నిచోట్ల ప్రజలు విసుగు చెంది ఆధార్ ఆపరేటర్లపై తిరగబడుతున్నారన్నారు. మరికొన్ని చోట్ల పెద్దఎత్తున తోపులాటలు జరిగి పోలీసుల జోక్యం చేసుకునే వరకూ వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని ప్రతి జిల్లాలో అవసరమైనన్ని ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సంఖ్యను తగినంతగా పెంచాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News