Monday, May 6, 2024

వృద్ధాప్య పింఛన్ రూ. 2,750కు పెంపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడిస్తున్న పింఛన్‌పై రూ. 250 పెరగనుంది. తాజా నిర్ణయంతో ఇప్పటివరకు రూ.2500 ఉన్న ఫించన్ రూ. 2750కు పెరగనుంది. పెంచిన పింఛన్లు 2023 జనవరి నెల నుంచే లబ్ధిదారులకు అందనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 62.31 లక్షల పింఛన్‌దారులకు లబ్ధిచేకూరనుంది. మంగళవారం సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు పథకాలు, ప్రాజెక్టులపై ఆమోదముద్ర వేసింది. ఎస్‌ఐపీబీ ఆమోదించిన విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అదానీ, షిర్డిసాయి ఎలక్ట్రాకల్స్ నెలకొల్పే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి, జిందాల్ స్టీల్ భాగస్వామ్యంతో కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్‌కు ఆమోదం తెలిపారు.

ఎపి జ్యూడీషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి అనుమతిని ఇచ్చింది. హబ్స్ ఏర్పాటులో కొత్త విధానానికి, ఎపి పంప్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదించింది. అలాగే భూముల రీ సర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు ఆమోదించారు. నాడు –నేడు ద్వారా పాఠశాలలో టీవీల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకరించింది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ కంటెంట్ అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఉపాధ్యాయులకు బోధనేతర విధుల రద్దుకు జారీ చేసిన జీవోకు ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మారుస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 1301.68 చదరపు కిలో మీటర్ల పరిధిలో బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News