కొలంబో: ఉపఖండంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్గా పేరున్న ఆసియా కప్ నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈసారి ఆసియాకప్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. తన హోం గ్రౌండ్గా పరిగణిస్తున్న యుఎఇలో ఈసారి ఆసియా కప్ను నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) భావిస్తోంది. కానీ, కరోనా వల్ల యుఎఇలో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆసియాకప్ను నిర్ణీత సమయంలో నిర్వహించడం పాకిస్థాన్ బోర్డుకు కష్టంగా మారింది. ఇలాంటి స్థితిలో ఈసారి ఆసియాకప్ను నిర్వహించే బాధ్యతను శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఇవ్వాలని పిసిబి నిర్ణయించింది.
దీనికి శ్రీలంక క్రికెట్ బోర్డు అంగీకారం తెలిపింది. దీంతో ఈ ఏడాది ఆసియాకప్ టోర్నమెంట్ శ్రీలంకలో జరిగే అవకాశాలు మెరుగు పడ్డాయి. సెప్టెంబర్లో శ్రీలంక ఈ ట్రోఫీని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. దీనికి ఆసియాకు చెందిన వివిధ క్రికెట్ బోర్డులు కూడా తమ సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈసారి ఆసియాకప్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వచ్చే సారి జరిగే ఆసియాకప్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.