Saturday, September 21, 2024

ఆదర్శ పల్లెల రాష్ట్రం

- Advertisement -
- Advertisement -

అద్భుతంగా సాగుతున్న పల్లె ప్రగతి

రాష్ట్రంలోని పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి
అన్ని పల్లెలకు ట్రాక్టర్లు, డంప్‌యార్డ్‌లు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రగతి వనాలు, భగీరథ నీరు
ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదిక, ప్రతి నెలా పంచాయతీలకు నిధులు
మంత్రి దయాకర్‌రావుకు సిఎం అభినందన, సంగారెడ్డి కలెక్టర్‌కు ప్రశంస

మన తెలంగాణ/హైదరాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నదని సిఎం కెసిఆర్ కితాబిచ్చారు. రాష్ట్రంలో పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠధా మాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు సమకూరుతున్నాయన్నారు. ఇది దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. ఇది మన రాష్ట్రానికి గర్వకారణమని సిఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుజు కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే సొంతంగా ట్రాక్టర్లు ఉండేవన్నారు. కానీ, నేడు 12,765 గ్రామ పంచాయతీలకు గాను 12,681 గ్రా మాల్లో ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు సమకూరాయన్నారు. రాష్ట్రంలోని పంచాయతీలు ఎక్కడ నుండి ఎక్కడికి పోయాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహారణ చాలన్నారు. గతంలో అడవులు నరకడమే తప్ప పెంచడమనే మాటేలేదన్నారు. కానీ నేడు తెలంగాణ పల్లెల్లో పచ్చదనం వెల్లివిరుస్తున్నది.
పచ్చదనం..పరిశుభ్రతలో దేశానికే ఆదర్శం
పచ్చదనం.. పరిశుభ్రత విషయాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామంలో నేడు నర్సరీ ఏర్పాటైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,755 నర్సరీలు ఉన్నాయని తెలిపారు. గ్రామాల్లో మొక్కలు పెట్టి, వాటిని సంరక్షించే పనులు ఎంతో బాధ్యతగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో 91శాతం బతికాయన్నారు. ప్రతి గ్రామానికి ఓ ఉద్యానవనం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని 19,470 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వివరించారు. ఇందులో19,027 చోట్ల స్థలాలను గుర్తించిందని తెలిపారు. 15,646 చోట్ల మొక్కలు కూడా నాటడం పూర్తయిందన్నారు. మిగతా చోట్ల వేగంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రతి క్లష్టర్‌కు ఒక రైతు వేదిక
రైతులు కూర్చొని చర్చించుకోవడానికి గతంలో ఓ వేదిక అంటూ లేదని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్లస్టర్ కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మిస్తున్నదన్నారు. రాష్ట్రంలో మొత్తం 2,601 చోట్ల రైతు వేదికలు నిర్మాణం ప్రారంభం కాగా, ఇప్పటికే 2580 చోట్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. రైతులు తమ పంటలను ఎండబెట్టడానికి, నూర్పడానికి వీలుగా కల్లాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటివిడత 93,875 చోట్ల కల్లాల నిర్మాణం ప్రారంభమైందన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 12,736 గ్రామాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతున్నదని వివరించారు. ఇందులో 91శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. 9,023 చోట్ల డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ తయారీ జరుగుతున్నదన్నారు.. గతంలో స్మశానవాటికలు లేక సొంతస్థలం లేనివారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ దుస్థితిని నివారించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఖచ్చితంగా వైకుంఠధామం నిర్మించాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని 12,742 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం జరుగుతున్నదని వెల్లడించారు.

క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీలకు నిధులు
గతంలో గ్రామ పంచాయతీలు కరంటు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్ సంస్థలకు భారీ మొత్తంలో బకాయిలు పడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా గ్రామ పంచాయతీలు కరంటు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నదని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రతినెలా రూ.308 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నదన్నారు. దీనివల్ల గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధం లేకుండా కొనసాగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నిరకాల సౌకర్యాలు, వెసులుబాట్లు, పచ్చదనం, పరిశుభ్రత, పారదర్శక పద్ధతులు కలిగిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదన్నారు. గ్రామాల్లో పెరిగిన పరిశుభ్రత వల్ల ఈసారి డెంగ్యూ వ్యాధి రాకపోవడాన్ని మనం గమనించవచ్చు” అని ముఖ్యమంత్రి అన్నారు. “తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు నేల విడిచి సాము చేయకుండా గ్రామాలే కార్యవేదికగా గుర్తించాలి. గ్రామాలను గొప్పగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్, డిపిఒలు తరచూ గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించాలని సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు గ్రామాల్లో పర్యటించినప్పుడు ఖచ్చితంగా పల్లె ప్రగతి పనులను సమీక్షించాలన్నారు. ఈ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. మండల పంచాయతీ అధికారులు నిత్యం అన్ని గ్రామాల్లో పర్యటించాలన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఉంది కాబట్టి ఎక్కడైనా మొక్కలు చనిపోతే వెంటనే రిప్లేస్ చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందించాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మంత్రి దయాకర్ రావుకు అభినందన
పల్లె ప్రగతి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృషి చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రి దయాకర్ రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రగతి పనులను పర్యవేక్షిస్తున్నారని, గ్రామ సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు ఎంతో శ్రమకోర్చి పనులు చేస్తున్నారని సిఎం కేసీఆర్ ప్రశంసించారు.

సంగారెడ్డి కలెక్టర్‌కు ప్రశంస
అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నూటికి నూరుశాతం నెరవేర్చిన సంగారెడ్డి కలెక్టర్‌ను హన్మంతరావును ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లాలోని మొత్తం 647 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించి, వాటిని అందుబాటులోకి తెచ్చారని సిఎం అన్నారు. సంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా వందకు వందశాతం వైకుంఠధామాలు నిర్మించాలని ఆదేశించారు.

Palle Pragathi is Awesome Says CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News