కొవిడ్తో శీతాకాల పార్లమెంట్ రద్దు
బడ్జెట్ సెషన్లోనే కలుద్దామన్న సర్కారు
న్యూఢిల్లీ: ఈసారి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించకూడదని కేంద్రం నిర్ణయించుకుంది. శీతాకాలంలో కొవిడ్ 19 మరింత సంక్లిష్టతలను కల్పిస్తుందని సర్కారు శీతాకాల సెషన్ రద్దుకు మొగ్గుచూపింది. లోక్సభలో కాంగ్రెస్ పక్షం నేత అధీర్ రంజన్ చౌదరికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ రాసిన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. జనవరిలోనే బడ్జెట్ సెషన్ ఏర్పాటు చేయడం సముచితం అవుతుందని, కొవిడ్ ఉధృతిని కొని తెచ్చుకోవడం ఎందుకని కేంద్రం తరఫున మంత్రి ఈ లేఖలో పేర్కొన్నట్లు వెల్లడైంది. ప్రత్యేకించి ఢిల్లీలో ఈ చలికాలంలోకరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, దీనిని తట్టుకోవడం కీలక అంశం అవుతుందని, దీనిపైనే దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పుడు మనం డిసెంబర్ నెల మధ్యలో ఉన్నామని, కొవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే దశకు చేరామని మంత్రి తెలిపారు. కొవిడ్ కేసుల సంఖ్య పట్ల ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, ఇటీవలే తాను వివిధ పార్టీల నేతలతో ముచ్చటించానని, కరోనా విస్తరిస్తోన్నందున శీతాకాల సెషన్ పెట్టకపోవడమే మంచిదని వారంతా కూడా తనకు తెలిపారని మంత్రి కాంగ్రెస్ నేతకు రాసిన లేఖలో తెలిపారు. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ చివరి వారంలో కానీ, డిసెంబర్ తొలి వారంలో కానీ ప్రారంభం అవుతుంది.
Parliament Winter Session Cancelled due to Covid 19