మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్తో వైన్ షాపులు, బార్లు బంద్ కావడంతో మద్యం వినియోగదారులు కొందరు గుడుంబా వైపు మళ్లే అవకాశం ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేవించారు. గుడుంబా నిర్మూలనకు పకడ్బందిగా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అదిలాబాద్, వరంగల్ -రూరల్, మహబుబాబాద్, భూపాల పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాలోని మారు మూల తండాలలో గుడుంబా తయారుదారులను గుర్తించి కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
గుడంబా తయారు చేసే వారిపై అవసరమైతే పిడి యాక్టు కింద కేసులను నమోదు చేయాలని ఆదేవించారు. గతంలో గుడుంబా తయారు చేసిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి, పునరావాసం కల్పించినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖకు చెందిన కింది స్థాయి సిబ్బంది సూపరిండెంటెడ్ స్థాయి వరకు ప్రభుత్వం నిర్థేశించిన విధులలో అలసత్వం ప్రధర్శిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సస్పెండ్ చేస్తామన్నారు. ఈ వీడియో కాన్పరెన్సులో ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ అజయ్ రావు, వివిధ జిల్లాల ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్లు పాల్గొన్నారు.