మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పులల సంచారం ప్రజలను హడలెత్తిస్తోంది. మొన్న ఆదిలాబాద్, నిన్న ఆసిఫాబాద్, నేడు భద్రాద్రి కొత్తగూడెం పులి సంచారిస్తుండటంతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం అనిషెట్టిపల్లి గ్రామం గుళ్లమడుగు సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. గుళ్లమడుగు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ ఆవుపై పులి దాడి చేసింది. ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు పులి సంచారానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. పులి పాద ముద్రల ఆధారంగా అది ఎటువైపునకు వెళ్లిందనే దానిపై గాలింపు చేపట్టారు. కాగా, పులి సంచారం నేపథ్యంలో అనిషెట్టిపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇళ్ల నుంచి ఒంటరిగా బయటకు రావడానికి జంకుతున్నారు.
పులిని బందించాలని అటవీ అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు.ఇదిలాఉండగా, ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పుష్కరవనంలో పులి సంచరించింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఓ యువకుడు, తనకు రోడ్డు దాటుతున్న పులి కనిపించిందని అటవీశాఖాధికారులకు సమాచారం అందించాడు. దాని ఆధారంగా అటవీ అధికారులు ఆధారాలు సేకరించగాఆ వ్యక్తి చెప్పింది నిజమే అని అటవీశాఖ అధికారులు తేల్చారు. ఇప్పుడు మరోసారి పులి సంచారం అక్కడ కలకలం రేపుతోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం సమీపంలో పులి సంచారం కలకలం సౄష్టించింది. వైల్డ్లైఫ్ పరిధిలోని గుండ్లమడుగు అటవీ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి పులి సంచరించినట్లు గ్రామస్థులు తెలిపారు.భద్రాద్రి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఆవుదూడపై పులి దాడి చేసిందని, తాము కేకలు వేయడం వల్ల దూడను వదిలి పారిపోయిందని రాత్రి కాపలాకు వెళ్లిన రైతులు వెల్లడించారు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. పులిదాడిలో ఆవుదూడ స్వల్పంగా గాయపడినట్లు గుర్తించారు.