న్యూఢిల్లీ: భారత సైన్యంలో మహిళా అధికారులకు సంపూర్ణ సాధికారితను కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. షార్ట్ సర్వీస్ కమిషన్డ్(ఎస్ఎస్సి) మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసినట్లు సైన్యం ప్రకటించింది. భారతీయ సైన్యంలోని మొత్తం 10 విభాగాలలో ఎస్ఎస్సి మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించడానికి మార్గం సుగమం అయినట్లు సైనిక ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు.
ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్స్, ఆర్మీ ఏవియేషన్, ఎలెక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఆర్మీ సర్వీస్ కోర్, ఇంటెలిజెన్స్ కోర్తోపాటు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్, ఆర్మీ ఎడ్యుకేషన్ కోర్ విభాగాలలో మహిళా అధికారులకు ఇక పర్మనెంట్ ప్రాతిపదికన పదవులు లభిస్తాయి. ఎస్ఎస్సి మహిళా అధికారులు తమ సమ్మతిని తెలియచేసి, అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తర్వాత సెలెక్షన్ బోర్డు ఏర్పాటు జరుగుతుందని ఆయన చెప్పారు.
Permanent Commission for Women Officers in Army