అత్యంత ప్రభావశీలుర జాబితాలో ప్రధాని మోడీ
షహీన్బాగ్ దాదీ, ఆయుష్మాన్ ఖురానాకూ చోటు
ప్రకటించిన టైమ్ మ్యాగజైన్
న్యూఢిల్లీ: టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ స్థానం దక్కించుకున్నారు. 2020 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన జాబితాలో ఢిల్లీలోని షహీన్బాగ్లో సిఎఎకి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలకు ప్రతిబింబంగా మారిన 82 ఏళ్ల వృద్ధ మహిళతోపాటు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా చోటు సంపాదించుకున్నారు. తమ వృత్తి జీవితాలలో అసమాన విజయాలు అందుకున్న వ్యక్తులు, నటులు, నాయకులు, దిగ్గజాలు, విశిష్ట వ్యక్తులు తదితరులను ఏటా టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలురైన వ్యక్తులుగా ఎంపికచేస్తుంది. ఇటీవలే 70వ వసంతంలోకి ప్రవేశించిన ప్రధాని నరేంద్ర మోడీ నాయకుల విభాగంలో ఎంపిక కాగా, షహీన్బాగ్ దాదీగాపేరు పొందిన బిల్కీస్కు విశిష్ట వ్యక్తుల విభాగంలో చోటు దక్కింది. ప్రధాని నరేంద్ర మోడీకి 2017లో టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన జాబితాలో కూడా స్థానం లభించింది. 2020 జాబితాలో స్థానం పొందిన వారిలో గూగుల్ సిఇఓ సుందర్ పిచయ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా తదితరులు ఉన్నారు.