Saturday, April 27, 2024

మోడీకి గెలుపు శాశ్వతం కాదు

- Advertisement -
- Advertisement -

నరేంద్ర మోడీ 2014లో ప్రధాని అయినప్పటి నుంచి, ప్రధానంగా 2019లో రెండోసారి గెలిచినప్పటి నుంచి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఒత్తిడి ఎక్కువైంది. మోడీ ప్రభుత్వం ఎన్నికల పర్యవేక్షణ వ్యవస్థను బలహీనపరిచింది. తనకు అనుకూలంగా తీర్పులు ఇచ్చే విధం గా న్యాయమూర్తులను సుముఖం చేసుకున్నది. చట్టాన్ని అమలు చేసే సంస్థలను ప్రత్యర్థులపైన ప్రయోగించడం నేర్చుకొని భారత మీడియా వ్యవస్థపైన అదుపు సాధించింది. గత సంవత్సర కాలంలోనే ప్రధాని పైన ఏదో సరదాగా జోక్ చేసినందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించి, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించింది. కుయుక్తులలో నిష్ణాతుడైన బడా పారిశ్రామికవేత్త అదానీ చేత అంతవరకూ స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఎన్‌డిటివి ఛానల్‌ని కొనుగోలు చేయించింది. ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టింగులను సోషల్ మీడియా నుంచి తొలగించేందుకు నిఘా సంఘాన్ని నియమించింది. ఢిల్లీ, ముంబైలో బిబిసి కార్యాలయాలపై చట్టాలను అమలు చేసే సంస్థల చేత దాడులు చేయించింది.

మోడీని విమర్శిస్తూ డాక్యుమెంటరీ నిర్మించి ప్రదర్శించినందుకు బిబిసిపైన కక్ష తీసుకోవడానికే దాడులు జరిపింది. వీటన్నింటికీ అధికారంలో ఉండడం వల్ల మోడీ శక్తి పెరిగింది. ఎన్నికలలో విజయాలను ప్రత్యర్థుల నోళ్ళు మూయించేందుకు వినియోగించుకోవడంలో భారతీయ జనతా పార్టీ ప్రావీణ్యం సంపాదించి, 2024 లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా గెలుపు ప్రతిపక్షాలకు అసాధ్యమయ్యే విధంగా పావులు కదిపుతోంది. అయితే భారత ప్రజాస్వామ్యానికి ప్రాణభిక్ష పెట్టే ఓటు ఏమి చేస్తుందోనని ప్రజలు నేడు ఎదురు చూస్తున్నారు. గుజరాత్‌లో 2002లో ముస్లింలపైన జరిగిన దాడులను ప్రోత్సహించారన్న అభిప్రాయంతో నరేంద్ర మోడీ అమెరికాలో అడుగు పెట్టడాన్ని 2005లో నిషేధించారు. కానీ ఇప్పుడాయన అమెరికాలో అత్యంత విలువైన అతిథి. భారత ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలంటే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ గురించి తెలుసుకోవాలి. ఒకప్పుడు గాంధీ నాయకత్వంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కుదురుకున్న రాజకీయ పార్టీ బిజెపి,

దాని వెనుక దన్నుగా సిద్ధాంత బలం కలిగిన ఆర్‌ఎస్‌ఎస్ ఉంది. కాంగ్రెస్ ఉదారవాద లౌకిక వ్యవస్థను కోరుకుంటే ఆర్‌ఎస్‌ఎస్ హిందూ మతవాదాన్ని అనుసరించే భారత దేశాన్ని అపేక్షిస్తున్నది. హిందువుల కోసం, హిందువులు పాలించే హిందూ రాష్ర్ట కావాలనేది ఆర్‌ఎస్‌ఎస్ అభిప్రాయం. ప్రధాని అయిన తర్వాత మోడీకి మౌలికమైన సవాల్ కట్టెదుట నిలిచింది. మధ్యే మార్గంగా ప్రభుత్వం వ్యవహరించే విధంగా పరిమితులు ఉన్నప్పుడు తన హిందూత్వ అజెండాను ఎట్లా అమలు చేయాలన్నదే ప్రశ్న. ఆ పరిమితులను తొలగించడం ఒక్కటే మార్గం. అయితే ఆయన ఎంచుకున్న వ్యూహం భారత ప్రజాస్వామ్య హృదయాన్ని గాయపరుస్తుంది. భారత లౌకిక వాదాన్నీ, ప్రజాస్వామ్యాన్ని మోడీ కాలరాశారు. మోడీ ఇండియాలో ఏమి చేశారో అర్థం చేసుకోవాలంటే రెండు అజెండాలను కలిపి అమలు జరిపితే ఏమి అవుతుందో ఊహిస్తే చాలు. వాటిలో మొదటి అజెండా ప్రధాన మంత్రిగా హిందూత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేసి హిందువుల సమాజాన్నీ, ఓటర్లనూ విభజించడం. రెండవది న్యాయవ్యవస్థ, పర్యవేక్షక సంస్థలు, స్వేచ్ఛాయుతమైన మీడియా, ప్రతిపక్షాలను బలహీనపరిచే విధంగా తన చేతుల్లో సర్వశక్తులనూ కేంద్రీకృతం చేసుకోవడం.

ఈ రెండింటిలో ఒక అజెండా మరో అజెండాకు శక్తి ప్రసాదిస్తుంది. హిందువులలో ఎంత మంది తన హిందూత్వ వాదాన్ని ఆమోదిస్తారో మోడీ ప్రాబల్యం అంతగా పెరుగుతుంది. ఫలితంగా న్యాయమూర్తులపైనా, ఉన్నతాధికారులపైనా, విలేఖరులపైన యథేచ్ఛగా దాడులు కొనసాగడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలు సమకూరుతాయి. ప్రభుత్వాధికారాలనూ, మీడియాను తన గుప్పెటలో ఎంత గట్టిగా బంధిస్తే అంత తేలికగా హిందూత్వ వాదనను ప్రచారం చేయవచ్చు. ఈ అజెండాల అమలు ఫలితంగా ప్రభుత్వాలు మధ్యస్థంగా వ్యవహరించాలనే నియమం నీరుగారిపోతుంది. అధికార పార్టీకి అనుకూలమైన వ్యవస్థలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దీనితో అధికార పార్టీ గెలుస్తూ ప్రతిపక్షం నిర్వీర్యం అవుతూ వస్తుంది. మోడీ ఎదుగుదలకు ముందు బిజెపి ఎన్నికల విజయాలు పరిమితమైనవి. సమాజంలో సంపన్నులూ, కాషాయ పార్టీ ఆర్థిక విధానాలనూ, సామాజిక ధోరణులనూ సమర్థించేవారు మాత్రమే బిజెపికి ఓటు చేసేవారు.

విద్యా సంస్థలలోనూ, ప్రభుత్వ ఉద్యోగాలలోనూ రిజర్వేషన్లు అమలు చేసి చారిత్రకంగా పీడనకు గురైన వర్గాల సంక్షేమం కోసం కొనసాగుతున్న ప్రయత్నాలను సహించని అగ్రవర్ణాల వారిలో కొందరు బిజెపి సమర్థకులలో ఉన్నారు. కుల వ్యవస్థను రూపుమాపడానికి జరిగే ప్రయత్నాలనూ, రిజర్వేషన్లనూ బిజెపి వ్యతిరేకిస్తుంది. మోడీ హయాంలో బిజెపి పేద, నిమ్న వర్గాల హిందువులలో కొంతవరకూ వేళ్ళూనింది. కానీ దాని అసలు పునాది అయిన అగ్రవర్ణాలను వదులుకోలేదు. 2019 నాటికి పేద హిందువులు కూడా సంపన్న హిందువులతో పాటు బిజెపికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన అనంతరం హిందూత్వ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో సాధించిన విజయం కీలకమైనది. ఇవి కాక ఇతర విషయాలు కూడా ముఖ్యమైనవి ఉన్నాయి. మోడీ, రాష్ర్ట స్థాయి బిజెపి నాయకులు హిందూత్వ సిద్ధాంతాన్ని తమ ఉపన్యాసాలలో పదేపదే ఉటంకిస్తున్నారు. ముస్లింల హక్కులకు కావాలనే భంగం కలిగిస్తున్నారు. పొరుగున ఉన్న ముస్లింలు ఏమి చేస్తారోనన్న ఆందోళన హిందువులలో పెరిగే విధంగా మాట్లాడటం, చేయడం బిజెపి నాయకుల వ్యూహం. ఇంత వరకూ బిజెపి సాధించిన విజయాలు భావజాలానికి సంబంధించినవే.

పౌరసత్వ సవరణ చట్టం, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించే చట్టం, పాఠ్యాంశాలలో భారత చరిత్రలో ముస్లింల పాత్రను తగ్గించడం లేదా ఎత్తివేయడం లాంటివి అన్నీ బిజెపి సైద్ధాంతిక పోకడలకు నిదర్శనాలు. జమ్మూ-కశ్మీర్ ఒక్కటే ముస్లింలు మెజారిటీ ఉన్న రాష్ర్టం. పాకిస్తాన్‌తో వివాదం ఉన్న రాష్ర్టం కూడా అదే. 2019లో మోడీ రద్దు చేసే వరకూ జమ్మూ-కశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. వాస్తవానికి హిందువులలో విభేదాల పరిష్కారం చేయడం కంటే కూడా ప్రధానమైనది ముస్లింలతో హిందువులకు ఉన్న విభేదాలనే విషయాన్ని ప్రచారం చేయడంలో బిజెపి రాజ్యశక్తిని వినియోగించింది. ఇటువంటి ప్రచారానికి లవ్ జిహాద్ ఒక ఉదాహరణ. హిందువుల అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచించి, పెళ్ళి చేసుకొని వారిని ఇస్లాంలోకి మార్చడం ద్వారా దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్ర లవ్ జిహాద్ అని ప్రచారం. ఈ కారణంగా కొందరు ముస్లిం యువకులను అరెస్టు చేశారు.

ఇదే ఇతివత్తంతో వచ్చిన కేరళ స్టోరీ సినిమాను హిందూత్వవాదులూ, బిజెపి ప్రభుత్వాలూ ప్రోత్సహించాయి. ముస్లిం వ్యతిరేకతను ప్రచారం చేయడం వల్ల ప్రజల వైఖరిలో మార్పు వచ్చినట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను లాగికొట్టి చంపే ఘటనల సంఖ్య పెరిగిందని వర్షణే తయారు చేసిన 2022 పరిశోధనాపత్రం స్పష్టం చేసింది. తమ పైన రాజ్యం చర్య తీసుకోదనే భరోసా నిందితులకు ఉన్నప్పుడే ముస్లింలను కొట్టి చంపడం సాధ్యం అవుతుంది అని వర్షణే అంటారు. భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడటం ఇదే మొదటిసారి కాదు. అంతర్యుద్ధం పోకడలు స్పష్టంగా కనిపిస్తున్న దశలో మోడీలాగానే ప్రజలలో ప్రాబల్యం కలిగిన కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని 1975 జూన్ లో ప్రకటించారు. అన్ని ప్రాథమిక హక్కులనూ, స్వేచ్ఛలనూ హరించారు. దాదాపు రెండేళ్ళ పాటు భారత నియంతత్వ పాలనలో మగ్గింది.

ఆర్‌ఎస్‌ఎస్ నాయకులతో సహా ఇందిరా గాంధీ రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేసి జైల్లో కుక్కించారు. మార్చి 1977లో అత్యయిక పరిస్థితిని అకస్మాత్తుగా ఎత్తివేశారు. ఇందిరాగాంధీ ఎన్నికలు ప్రకటించారు. కాంగ్రెస్ ఓడిపోయింది. ఐచ్ఛికంగానే ఇందిర అధికారం నుంచి తప్పుకున్నారు. తర్వాత జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ఆధిక్యం గల వ్యవస్థ పోయి ఆరోగ్యకరమైన బహు పార్టీల వ్యవస్థ అమలులోకి వచ్చింది. మోడీ కూడా అంతే ఆకస్మికంగా, అంతే ఆశ్చర్యకరంగా అధికారం కోల్పోవచ్చు. తక్షణ సమస్యలకు స్పందిస్తూ ఆత్యయిక పరిస్థితిని ఇందిరా గాంధీ విధించారు. ఇందుకు భిన్నంగా మోడీ అనేక సంవత్సరాలుగా వ్యవస్థలను భ్రష్టుపట్టించి ఒక పద్ధతి ప్రకారం అప్రకటిత నియంతత్వాన్ని ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుత పరిస్థితిని ఎమర్జెన్సీ పరిస్థితితో పోల్చడం సరైనదో కాదో చెప్పలేము కానీ భారత ప్రజాస్వామ్యం ఇంకా చచ్చిపోలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఎందుకంటే 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. అమెరికాలో ట్రంప్ లాగా, బ్రెజిల్‌లో జాయిర్ బోల్సోనారో లాగానే మోడీ కూడా పరాజయం పొందవచ్చు. బిజెపిని ఓడించివచ్చని ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో, కర్ణాటకలో ప్రజలు నిరూపించారు. భారత సమాఖ్య వ్యవస్థలో రాష్ర్ట ప్రభుత్వాలకు బలం ఉంటుంది. జాతీయ స్థాయిలో సైతం ప్రజలకు సందేశం పంపించగల శక్తి ప్రతిపక్షాలకు లేకపోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News