పుణె: కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో చేతులు కలిపిన పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను(ఎస్ఐఐ) ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించనున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధాని సందర్శించనున్నట్లు తమకు సమాచారం అందిందని, అయితే ఆయన సందర్శన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని పుణె డివిజనల్ కమిషనర్ సౌరభ్ రావు గురువారం తెలిపారు. ప్రి-క్లినికల్ టెస్ట్, ఎగ్జామినేషన్, అనాలిసిస్ కోసం కొవిడ్-19 వాక్సిన్ తయారీకి ఏడు సంస్థలకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. అందులో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి.
ప్రధాని మోడీ పుణెలోని ఎస్ఐఐని సందర్శించే అవకాశం ఉందని సౌరభ్ రావు మంగళవారం నాడే వెల్లడించారు. ఆయన సందర్శనలో భాగంగా కరోనా వ్యాక్సిన్ తయారీ పరిస్థితిని సమీక్షించడంతోపాటు వ్యాక్సిన్ విడుదల, ఉత్పత్తి, పంపిణీ తదితర అంశాలపై సమీక్షించే అవకాశం ఉందని తెలిసింది. ఇదిలా ఉండగా&100 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు డిసెంబర్ 4న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతోపాటు జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ను సందర్శించనున్నట్లు కూడా సౌరభ్ రావు తెలిపారు.