Saturday, April 27, 2024

వికసిత్ భారత్ ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీజీ ప్రభుత్వం తన పదేళ్ళ పాలనా కాలంలో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని దేశ మొత్తం తిరిగి వివరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర మంత్రులు ఈ దిశగా ప్రయత్నాలను ప్రారంభించారు. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జిడిపి) 7శాతం వృద్ధి రేటుతో ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని అంటున్నారు. అంతేకాక 2047 నాటికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో 3వ ఆర్ధిక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావాన్ని ప్రధాని మోడీజీ ఇటీవల వ్యక్తం చేశారు కూడా. ఇది సంతోషించదగిన విషయం. అయితే ఈ ప్రకటనను కేవలం ఊహలు అభిలాషలపరంగా కాకుండా వాస్తవిక గణాంకాల ఆధారంగా పరిశీలించడం అవసరం. సాధారణంగా జిడిపి వృద్ధిరేటు ఏమేరకు పెరిగిందో చూడాలంటే అంతకు ముందు సంవత్సరంతో పోల్చి ప్రస్తుత జిడిపి ఎంత పెరిగిందో ప్రకటిస్తారు.

కానీ మన ప్రభుత్వం 2021లో కోవిడ్ సందర్భంగా దేశ జిడిపి మైనస్ 5.8% మాత్రమే నమోదైంది. దీనితో పోల్చి 2022- 2023లలో జిడిపి వృద్ధిరేటు 7 శాతానికి పైగా వృద్ధి చేరిందనట్లుగా ప్రభుత్వం లెక్కలు కట్టింది. కానీ వాస్తవాలు పరిశీలిస్తే 2004- 14 సంవత్సరాల మధ్య పదేళ్ల కాలంలో జిడిపి వృద్ధిరేటు సగటున 8.1 శాతంగా ఉండింది. అదే పదేళ్ళ కాలంలో జిడిపి ప్రభుత్వలో అది కేవలం 5.4% మాత్రమే వుంది. ఒకవేళ బిజెపి ప్రభుత్వం చెబుతున్నట్లు జిడిపి ప్రగతి పథంలో ఉన్నట్లయితే ఆ అభివృద్ధి ఫలాలు సామాన్యు ప్రజల నిత్యజీవన విధానంలో ప్రతిబింబించాలి కదా! మరి వాస్తవంగా అలా వుందా? నిష్పాక్షికంగా పరిశీలన చేద్దాం.

ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదలచేసిన తాజా నివేదిక ప్రకారం ప్రజల మధ్య ఆర్ధిక అంతరాలు పెరిగిపోతున్నాయని వెల్లడించింది. అలాగే ‘ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్’ సంస్థ కూడా తన నివేదికలో గత దశాబ్ద కాలంలో దేశంలోని సంపన్నుల ఆదాయం పది రెట్లు పెరిగిందని స్పష్టంగా వెల్లడించింది. ప్రస్తుతం వారి వార్షిక ఆదాయం నేటి భారత దేశ బడ్జెట్ కంటే అధికమని కూడా తెలిపింది. కేవలం దేశ జనాభాలో ఒక్క శాతంగా ఉండే సంపన్న వర్గాలకే మొత్తం ఆదాయంలో సుమారు 73% పోతుందనీ, ఇక 67 కోట్ల మంది సామాన్యు ప్రజల ఆదాయం మాత్రం కేవలం ఒక్క శాతమే పెరిగింది అని పేర్కొంది. మరి దీన్ని ప్రగతి పథం అంటారా? బిజెపి ఆర్ధిక నిపుణులు నిజాలు వెల్లడించాలి. దేశంలో అనునిత్యం విద్య, వైద్య, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఖర్చుల భారమై కుటుంబాలు రుణ భారంతో వొరిగి పోయాయి. వడ్డీలు చెల్లించలేక వున్న కొద్దిపాటి ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు.

దేశంలో ప్రతి ఏటా 6.3 కోట్ల మంది దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారని ఈ సంస్థ స్పష్టంగా పేర్కొంది. బిజెపి ప్రభుత్వం చెబుతున్నట్లు జిడిపి వృద్ధిరేటు బాగా వుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలి కదా! నిజానికి అలా పెరుగుతున్నాయా? ప్రధాని మోడీ ప్రభుత్వ హామీ ప్రకారం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ పాటికే ఈ పదేళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. మరి ఇచ్చారా? లెక్కలు ఉన్నాయా? ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత రేటు 10% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి కొత్త కొలువులు రాక పోగా వున్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి.
ఇప్పటికే దేశ జనాభా కుల, మత, ప్రాంత, లింగ వివక్షలతో కునారిల్లుతున్నది.

దానికి తోడు ఈ ఆర్థిక అసమానతలు కూడా చేరడంతో భారత భవిష్యత్తు ఆందోళనకరంగా వుందని జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రముఖ ప్రొఫెసర్ హిమాన్షు (జెఎన్‌యు)ఇదే విషయాన్ని బలపరచారు. పోనీ ప్రజల జీవనప్రమాణాలు ఏమైనా మెరుగుపడ్డాయా? అంటే అదీలేదు. పేదరికం పెద్ద ఎత్తున పెరుగుతోందని అంతర్జాతీయ సూచీలు వెల్లడిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన జన్‌ధన్ అకౌంట్లలో డబ్బులే లేవు. సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. 74.1 శాతం దేశ పౌరులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ తన నివేదికలో తెలిపింది. జిడిపి వృద్ధిరేటు సాధించడంలో విశేషమైన పాత్ర పోషిస్తున్న కార్మికులు, రైతుల జీవన స్థితిగతులు ఏమైనా మెరుగుపడ్డాయా? అంటే అదీ లేదు. ప్రభుత్వ సంస్థల్లో కెల్లా అతి పెద్దదైన రైల్వేలతో సహా ఉద్యోగ నియామకాలను కేంద్ర ప్రభుత్వం దాదాపు నిలిపివేసింది.

ఎటువంటి ఉద్యోగ భద్రత లేని, అత్యంత తక్కువ వేతనాలకు ఈ రోజున కార్మికులు పని చేయవలసి వస్తోంది. కొత్తగా వస్తున్న కొద్ది పాటి ఉపాధి కూడా కాంట్రాక్టు, అసంఘటిత రంగాల నుండే వస్తుంది. వీరికి నెలకు పదిహేను వేలకు మించి ఆదాయం లేదు. మహిళాభివృద్ధి, బేటీ పడావో అని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ మోడీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ, ఆశ, మిడ్ డే మీల్స్ వంటి రంగాల్లో పని చేస్తున్న సుమారు కోటి మందికి పైగా మహిళా కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు, వేతనాలు కూడా అత్యంత తక్కువ. అవి కూడా సకాలంలో విడుదల కావు. పేదలకు పోషకాహారం, మహిళా, శిశు సంరక్షణ వంటి ముఖ్యమైన అనేక సేవలందిస్తున్న ఈ స్కీం వర్కర్ల సమస్యలు చెప్పనలవికావు. చివరకు ఆర్‌ఎస్‌ఎస్ కు అనుబంధంగా వున్న భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా వీరి సమస్యల పరిష్కారానికై ఆందోళన చేయవలసి వచ్చింది.

ఎన్‌డిఎ మొదటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానం ఉద్యోగుల పొదుపు సొమ్మును కొద్ది మంది కార్పొరేట్లు దోచుకుపోయేలా తయారైంది. దీనిని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఇది చాలదన్నట్లు కార్మికులకు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కొంతైనా మేలు చేసే 27 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది.వాటి స్థానంలో సంఘం పెట్టుకోవడం, సమ్మెచేసే మౌలిక రాజ్యాంగ హక్కులను సైతం హరించే విధంగా కార్మిక వ్యతిరేక నిబంధలతో నాలుగు లేబర్ కోడ్‌లను మోడీ ప్రభుత్వం తయారు చేసింది. మరో పక్క వ్యవసాయ రంగంలో పూర్తి రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది. కార్పొరేట్ సేద్యాన్ని ప్రోత్సహించేలా నల్లచట్టాలను చేసింది. రైతులు ఎండలో, వానలో, చలిలో, కోవిడ్ విజృంభణ కాలంలో ఏడాదికి పైగా పెద్ద ఎత్తున వీధుల్లో పోరాటం చేసినందున వాటిని వెనక్కు తీసుకుంటున్నట్లు మోడీ పార్లమెంటులో ప్రకటించారు.

క్షమాపణలు కూడా చెప్పారు. కానీ ఆచరణలో అవే కార్పొరేట్ అనుకూల విధానాలనే కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. మోడీ పాలనలో శ్రామిక మహిళలతో పాటు సాధారణ మహిళలు కూడా పెద్ద ఎత్తున వివక్షకు గురవుతున్నారు. ‘నేషనల్ క్రైమ్ బ్యూరో’ నివేదిక ప్రకారం గత ఏడాది దేశంలో 62,946 మంది బాలికలు కనిపించకుండా పోయారు. వీరిలో అత్యధికులు వేశ్యా గృహాల పాలయ్యారు. ఇవన్నీ అధికారికంగా నమోదైన లెక్కలు. వాస్తవంలో ఇంకా ఎక్కువగా వుంటాయని అంచనా. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్రంలోని సుందర్ ఘర్ ప్రాంతంలో సర్వే నిర్వహించిన ‘ప్రగతి అనే స్వచ్ఛంద సంస్థ’ 70 గ్రామాలలో పదమూడు వేల మంది అమ్మాయిలు కనపడలేదని తన సర్వే నివేదికలో తెలిపింది. నేడు దేశం వికసిత్ భారత్ ఏమో గానీ అత్యధిక పేద, మధ్య తరగతి ప్రజానీకాన్ని అభివృద్ధి ఫలాల నుండి గెంటి వేసే భారత్‌గా రూపాంతరం చెందుతోంది. ఇది ఇలాగే కొనసాగితే 2047 కల్లా భారత దేశం ఎలా వుంటుందో ఊహించుకుంటేనే ఆందోళన కలుగుతుంది.

మోడీజీ అనుకూల మీడియా సంస్థల ద్వారా, సోషల్ మీడియా అనుబంధ సంస్థల ద్వారా ఎన్ని అసత్యాలతో, అభూత కల్పనలతో ఎంత ఊదరగొట్టినా ప్రజలు తమ నిత్య జీవిత అనుభవాలే నిజమేంటో వారికి తెలుపుతున్నాయి. మోడీ పదేళ్ళ పాలనలో అసమానతలు రెట్టింపుగా పెరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి అన్నది ముమ్మాటికీ నిజం. మోడీ ప్రభుత్వం కులం, మతం వంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి కొంత కాలం పబ్బం గడుపుకోవచ్చునేమో గానీ ఎల్లవేళలా అశేష ప్రజానీక నిత్యజీవిత అనుభవాన్ని మాయమాటలతో మోసపుచ్చలేరు. నిజం నిలకడపై తేలుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News