మన తెలంగాణ/హైదరాబాద్: అనర్హులకు పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద అనర్హులకు సొమ్ము జమ కావడంతో వెనక్కి తీసుకున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల జన్ధన్ ఖాతాలకు పిఎంజికెవై కింద జమచేసిన రూ.16 కోట్లకు పైగా నగదును వెనక్కి తీసుకున్నట్లు టిజిబి జనరల్ మేనేజర్ మహేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.దేశంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో జన్ధన్ ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆయా ఖాతాల్లో ఈనెల మొదటివారంలో దేశవ్యాప్తంగా నగదు జమ చేసింది.
ఈ క్రమంలోనే తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని 473 శాఖల్లో సుమారు 9లక్షల మంది ఖాతాల్లో ఏప్రిల్ నెలకు చెందిన రూ.500 చొప్పున జమ అయ్యాయి. అయితే వీరిలో 5,15,260 మంది మినహా మిగిలిన వారిని అనర్హులుగా బ్యాంకు తేల్చింది. ఇప్పటికే అనర్హుల ఖాతాల్లో జమ చేసిన సుమారు రూ.16కోట్లకు పైగా నగదును వెనక్కి తీసుకున్నట్లు 1 ఆగస్టు, 2014 తర్వాత ప్రారంభించిన ఖాతాలనే అర్హులుగా తేల్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ వద్ద జరిగిన పొరపాటు వల్లే నగదును అనర్హులకు జమచేశామని.. వారంరోజుల తర్వాత గుర్తించి వెనక్కి తీసుకున్నామని జిఎం వివరించారు. అనర్హుల్లో ఇప్పటికే లక్షకు పైగా ఖాతాదారులు నగదును తీసుకున్నారని వారి నుంచి తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.