న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా 2022 డిసెంబర్లోగా నిర్మించనున్న ప్రధానమంత్రి నూతన నివాస భవనానికి పర్యావరణ అనుమతులు లభించాయి. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ దాదాపు అన్ని రంగాలకు చెందిన కార్యకలాపాలపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు మాత్రం అత్యంత వేగంగా నిర్మాణమవుతోంది. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించినప్పటికీ నిర్మాణ పనులు ఆగకుండా ఉండేందుకు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం గుర్తించింది. ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో విమర్శిస్తున్నప్పటికీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో తగ్గేది లేదని ప్రకటించిన కేంద్రం నిర్ణీత సమయానికల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటోంది.
వచ్చే ఏడాది కల్లా నిర్మాణం పూర్తి కానున్న భవనాలలో ప్రధానమంత్రి నూతన నివాసం కూడా ఉంది. ప్రధానమంత్రి భద్రతకు సంబంధించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పిజి) ప్రధాన కార్యాలయం, అధికారుల కోసం ప్రత్యేక భవనం నిర్మాణాలు కూడా ఆ గడువులోగానే పూర్తి కావాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్(ఒకప్పటి రేస్ కోర్సు రోడ్)లో ఉంది. ఉప రాష్ట్రపతి నివాస భవనం వచ్చే ఏడాది మే నాటికి పూర్తి కావలసి ఉంటుంది. ఈ కొత్త భవనాల నిర్మాణానికి రూ.13,450 కోట్లు ఖర్చు కానునట్లు అంచనా వేశారు. దాదాపు 46,000 మందికి దీని వల్ల ఉపాధి లభిస్తుంది.
PM’s new house to be ready by 2022 Dec