తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి జరగనున్న ఎన్నికలు
16న నోటిఫికేషన్, 23వరకు నామినేషన్లు, డిసెంబర్ 10 పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు
హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కోడ్ :
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయెల్
ఉమ్మడి కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున, ఉమ్మడి అదిలాబాద్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎంఎల్సి స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎంఎల్సి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో 12, ఎపిలో 11 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారరు. డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ నిర్వహించి 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలో తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎంఎల్సి స్థానాలకు ఇసి షెడ్యూల్ విడదుల చేసింది. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున, ఉమ్మడి అదిలాబాద్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎంఎల్సి స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నాయి.
వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ప్రస్తుత సభ్యుల పదవి కాలం ముగియనుంది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎంఎల్సి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎంఎల్ఎల కోటా, స్థానిక సంస్థల కోటా ఎంఎల్సి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయాల్ ప్రకటించారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ అమలులోకి ఉంటుందని అన్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ అమలులోకి ఉంటుందని అన్నారు. హైదరాబాద్ మినహా మిగతా 9 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని సిఇఒ స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికలకు ఇచ్చిన మార్గదర్శకాలే ఈ ఎన్నికలకూ వర్తిస్తాయని వివరించారు.
నో పబ్లిక్ మీటింగ్స్..
ఎన్నికల నియామావళికి సంబంధించిన మార్గదర్శకాలు ఇసి వెబ్సైట్లో వివరంగా అందుబాటులో ఉన్నాయని శశాంక్ గోయల్ తెలిపారు. ఎలాంటి పబ్లిక్ మీటింగ్ నిర్వహించడానికి అనుమతి లేదని అన్నారు. రాజకీయ సమావేశాలకు కూడా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఎన్నికల నిర్వహణ ఉంటుందని, ఎన్నికల ప్రచారం, ప్రక్రియలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అందరికీ కొవిడ్ టీకాలు వేయాలని చెప్పారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, స్టార్ క్యాంపైనర్లు ఉండరాదని శశాంక్ గోయల్ తెలిపారు.
ఎంఎల్ఎల కోటాలో ఎంఎల్సి స్థానాలకు
ఎంఎల్ఎ కోటా కింద 6 ఎంఎల్సి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఎన్నికలకు ఇసి నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 17వ తేదీన పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.