కంగనపై ప్రకాశ్రాజ్ వ్యంగ్యాస్త్రాలు
ఒక్క సినిమాతో రాణీలక్ష్మీబాయ్ అవుతావా అంటూ కామెంట్స్
బెంగళూర్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కూ, మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వానికీ మధ్య వివాదం నడుస్తున్నవేళ ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ చేసిన వ్యాఖ్యలు ఆమెను చులకన చేసేలా ఉన్నాయి. జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియా ద్వారా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులపై సెటైర్లు వేసే ప్రకాశ్రాజ్ ఈసారి బాలీవుడ్లో నెలకొన్న వివాదంపై వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ‘ఒక్క సినిమాతోనే కంగనా తనకుతాను రాణీ లక్ష్మీబాయ్ అనుకుంటే, అప్పుడు పద్మావతిగా దీపికా పదుకొణె, అక్బర్గా హృతిక్, అశోకగా షారుఖ్ఖాన్, భగత్సింగ్గా అజయ్దేవగణ్, మంగళ్పాండేగా అమీర్ఖాన్, మోడీగా వివేక్ ఒబెరాయ్ అయిపోతారా..? అంటూ ప్రకాశ్రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ అనుమానాస్పద మృతి తర్వాత కంగన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముంబయి పాక్ ఆక్రమిత కాశ్మీర్(పిఒకె)గా మారిందని, మహారాష్ట్ర ప్రభుత్వం తాలిబన్లను తలపిస్తుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు శివసేన నేతలకు ఆగ్రహం తెప్పించాయి. బుధవారం బాంద్రాలోని కంగన కార్యాలయాన్ని చట్ట విరుద్ధ నిర్మాణమంటూ బృహన్ ముంబయి కార్పొరేషన్(బిఎంసి) అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. అదే సమయంలో ఆమె చండీగఢ్ నుంచి వై ప్లస్ సెక్యూరిటీ నడుమ ముంబయిలో అడుగుపెట్టారు.
Prakash Raj Comments on Kangana ranaut