బిజెపిలో చేరనున్న కంగన?
మనాలిలో జోరుగా ఊహాగానాలు
మనాలి: బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్, ఆమె కుటుంబ సభ్యులు బిజెపిలో చేరుతున్నారంటూ హిమాచల్ ప్రదేశ్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో తాము కాంగ్రెస్ను బలపరిచినప్పటికీ తమకు అండగా నిలబడినందుకు కంగన తల్లి, రిటైర్డ్ సంస్కృత టీచర్ ఆషా రనౌత్ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శుక్రవారం ధన్యవాదాలు తెలియచేయడంతో కంగన కుటుంబం బిజెపిలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు వదంతులు జోరందుకున్నాయి. కంగన దివంగత తాతగారు సర్జూ రామ్ గతంలో మండి జిల్లా గోపాల్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముంబయిలో కంగన కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ కూల్చివేసిన దరిమిలా ఆమెకు సంఘీభావంగా హిమాచల్ ప్రదేశ్ బిజెపి శాఖ మనాలికి 155 కిలోమీటర్ల దూరంలోని కంగన పూర్వీకుల స్వగ్రామం భంబ్లాకు పాదయాత్రను నిర్వహించింది.
దీనికి స్పందిస్తూ కంగన తల్లి ఆషా ప్రధాని మోడీకి, అమిత్ షాకు ధన్యవాదాలు తెలియచేశారు. తన కుమార్తెకు ముంబయిలో భద్రతను సమకూర్చినందుకు ధన్యవాదాలు తెలియచేసు కుంటున్నానని, తమకు అండగా నిలబడినందుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్కు కూడా కృతజ్ఞతలని ఆమె తెలిపారు. తన కుమార్తెకు ప్రభుత్వం భద్రతను కల్పించకపోయి ఉంటే ముంయిలో కంగనకు ఏం జరిగి ఉండేదో కూడా తాను ఊహించలేనని ఆమె పేర్కొన్నారు. కంగన, ఆమె కుటుంబం బిజెపిలో చేరికపై అధికారికంగా ఎటువంటి నిర్ధారణ జరగనప్పటికీ రనౌత్ కుటుంబానికి స్వాగతం చెప్పేందుకు హిమాచల్ ప్రదేశ్ బిజెపి శాఖ సంసిద్ధంగా ఉన్నట్లు సూచనలు వెలువడుతున్నాయి.
Congana Raunat joins in BJP Party?