Tuesday, April 30, 2024

ప్రైమరీ హెల్త్ సెంటర్లను బలోపేతం చేయాలి

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగేలా అధికారులు సమర్ధవంతంగా కృషి చేయాలి
పల్లె దవాఖాన, బస్తీ దవాఖానల పనితీరు మెరుగుపరుచుకోవాలి
మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేయాలి
రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ
వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య ను పెంచేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులైన నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ డెలివరీలు జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మాతా శిశు సంరక్షణకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.

చైల్డ్ హెల్త్‌లో భాగంగా టీకాలు అందేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఈ సమీక్షలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల అధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి సి. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండి వారి ఆరోగ్యానికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ, వారికి సరైన మందులు అందిస్తూ బాలింత, శిశు మరణాలను తగ్గించేందుకు వారు చేస్తున్న కృషిని అభినందించారు.

టెస్టులు వేగవంతం వేయాలి
తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా అవసరమైన శాంపిల్స్ సేకరించి టెస్టులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న పల్లె , బస్తీ దవాఖాన, పిహెచ్‌సిల పనితీరును మెరుగుపరచుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్‌ల నివారణకు అవసరమైన మందులు, పరీక్షలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. టిబి, కుష్టు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామ సభల ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ ఆర్.వి. కణ్ణన్, అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్, జెడిలు డాక్టర్ పద్మజ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ రాజేశం, డాక్టర్ జాన్ బాబు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసాద్,డాక్టర్ నందిత, డాక్టర్ శ్రీదేవి డాక్టర్ సుమిత్ర, సిఎఒ, సిఇఒలు పాల్గొన్నారు.

Health review 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News