అఫ్ఘన్లో పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి
ఎస్సిఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న తీవ్రవాదం ప్రపంచ దేశాలకు అతిపెద్ద సవాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శాంతిభద్రతలతో దేశాల మధ్య నమ్మకాన్ని నెలకొల్పే విషయంలో తీవ్రవాదం పెద్ద సమస్యగా నిలిచిందన్నారు. ప్రస్తుతం అఫ్ఘనిస్థాన్లో నెలకొన్న పరిణామాలు తీవ్రవాదాన్ని బలపరిచేలా స్పష్టంగా ఉన్నాయన్నారు. తజకిస్థాన్ రాజధాని దుషన్బే జరుగుతున్న షాంఘై సహకార సంస్థ ( ఎస్సిఓ) సమావేశంలో ప్రధాని మోడీ శుక్రవారం వర్చువల్గా పాల్గొన్నారు. ఈ మేరకు సభ్య దేశాలనుద్దేశించి ప్రసంగించారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలను నిలువరించాలని పిలుపునిచ్చారు. ఎన్సిఓలో కొత్తగా చేరుతున్న ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఖతర్ దేశాలకు ఆయన స్వాగతం పలికారు.
గత కొన్నేళ్లుగా భారత్ పోరాడుతున్న ప్రాంతీయ స్థిరత్వంపైనా ప్రధాని ప్రస్తావించారు. దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలపై కలిసికట్టుగా పని చేసేలా చూడాలని చైనా, పాకిస్థాన్ సహా మిగిలిన సభ్య దేశాలను కోరారు. ఇరవై ఏళ్ల తర్వాత అఫ్ఘన్నుంచి అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవడంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని పేర్కొన్నారు. అయితే చైనా, పాకిస్థాన్ తాలిబన్ల పాలనలో పాలు పంచుకుంటున్నాయని ఆరోపించారు. గతంలో అఫ్ఘనిస్థాన్లో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారత్ చేపట్టిందని మోడీ గుర్తు చేశారు.అప్ఘన్ను ఉపయోగించుకొని పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో జమ్మూ, కశ్మీర్లో అల్లర్లు సృష్టించే అవకాశముందని మోడీ అన్నారు. కాగా ఎస్సిఓ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సిఓ సభ్య దేశాల ప్రతినిధులతో అప్ఘన్ పై కీలక చర్చలు జరిపే అవకాశముంది.