Sunday, April 28, 2024

దేశదేశాల్లో పివి విగ్రహాలు

- Advertisement -
- Advertisement -

‘పివి ఔన్నత్యాన్ని దశదిశలా చాటుదాం’
మన తెలంగాణ/హైదరాబాద్: ఆధ్యాత్మికతలో, జ్ఞాన సంపన్నతలో, విధాన నిర్ణయాలలో, ప్రజా సంక్షేమ పాలనారీతిలో, సాహితీ సాంస్కృతిక విషయాలలో, రాజనీతి రీతులలో పివి నరసింహారావు తనకు తానే సాటి అని, భూమి పుత్రుడిగానూ, భారతీయ తాత్విక చింతనాపరుడిగానూ, విశ్వజ్ఞానంలోనూ, తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడనీ, అందుకే ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆయన పేరిట నిర్మించే స్మృతి మందిరం మ్యూజియం, ఆయన వ్యక్తిత్వంలోని విశిష్టతను మూర్తీభవించే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పార్లమెంటు సభ్యులు, పివి నరసింహారావు శత జయంతుత్యవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రవీంద్రభారతి కళాభవన్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో పివి శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. మంత్రి కెటిఆర్ ఈ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు.

స్మృ తి మందిరం పివి బహుముఖ ప్రజ్ఞకు అద్దం పట్టేలా ఉండాలని, వివిధ ప్రభుత్వ శాఖలను కలుపుకుని నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో సంవత్సరం పాటు వేర్వేరు ప్రాంతాలలో ఆయా కార్యక్రమాలను నిర్వహించాలనీ, పివితో ప్రమేయం ఉన్న ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ఆయా రాష్ట్ర రాజధానులలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పివి శతజయంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాయని కెటిఆర్ సూచించారు. కమిటీ సభ్యులందరూ రాబోయే మాసాలలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో జరగాల్సిన కార్యాచరణ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. నెలకు ఒకటి కన్నా తక్కువ కాకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకునిపోయేలా కార్యక్రమాలను రూపొందించాలని, దీనికోసం ప్రత్యేకంగా ఆయా శాఖలకు, వ్యక్తులకు, అధికారులకు సంబంధిత బాధ్యతలను అప్పగిస్తూ సబ్‌కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.
నిర్ణయాలు..
పివి జ్ఞాన భూమిలో నిర్మించి తలపెట్టిన మోమోరియల్ హాల్ డిజైన్‌లో నాలుగింటిని సిఎంకు నివేదించి ఆమోదం పొంది దానికి తగిన నిర్మాణ చర్యలను చేపట్టాలి. నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు నియమాలను అనుసరిస్తూ ప్రస్తుతం ఉన్న కరోనా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని జూన్ 2021 కల్లా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ స్మృతి మందిర నమూనా పివి వ్యక్తిత్వానికి, భారతీయ తత్వానికి అద్దం పట్టేలా ఉండాలి. విదేశాలలోని తెలంగాణ ప్రజలతో సమన్వయం చేసుకుని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లండన్, అమెరికా, సింగపూర్ వంటి దేశాలలో పివి విగ్రహాలను ఆవిష్కరించుకోవాలి. ఆ సందర్భంలో ప్రసంగాలు చర్చలు కూడా నిర్వహించాలి. దీనికి కావలసిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. నెలకొక్క ధీమ్‌తో కార్యక్రమాల రూపకల్పన చేయాలి. అలా ఆగస్తు మాసం ‘భూమి పుత్రుడికి నీరాజనం’ పేరిట పివి స్వగ్రామమైన వంగరలో సాంస్కృతిక పర్యాటక శాఖ ద్వారా టూరిజం సర్యూనట్ ఏర్పాటు అంశాలను నిర్వహించాలి.

సెప్టెంబర్ మాసంలో ‘పివికి కళాకారుల నీరాజనం’గా చిత్రకారులు, కార్తూనిస్టులు, క్యారికేచరిస్ట్‌లు, ఫోటోగ్రాఫర్స్‌తో వర్క్‌షాపులను నిర్వహించి, ఎగ్జిబిషన్‌లు కూడా నిర్వహించాలి. అక్టోబర్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాలలో ‘తెలుగు ప్రజల నీరాజనం’ పేరిట అక్కడి ప్రముఖులను అందరినీ కలుపుకుని సదస్సు నిర్వహించాలి.నవంబర్ మాసంలో పివికి ‘సాహితీసాంస్కృతిక నీరాజనం’ పేరిట కవి సమ్మేళనాలు, సాహితీగోష్టులు, ఆయన రచనలు, కథలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాలి. డిసెంబర్ మాసంలో ఆయన వర్థంతి సందర్భంగా జాతీయస్థాయి సదస్సులు నిర్వహించాలి. ఇలా ప్రతి మాసం కనీసం ఒక కార్యక్రమాన్ని ఒక థీమ్‌తో నిర్వహిస్తూ ఇవి తెలంగాణ ప్రజల నివసిస్తున్న వివిధ దేశాలలో కూడా జరిగేలా చర్యలు గైకొనాలి. పివి ఛాయాఛిత్రాలతో అంతర్జాతీయ స్థాయి కాఫీటేబుల్ పుస్తకాన్ని ప్రచురించడమే కాక, పివి రాసిన అముద్రిత రచనలను ప్రచురించాలి. గతంలో ప్రచురించిన పుస్తకాలు పునర్‌ముద్రించాలి. రానున్న అసెంబ్లీ సమావేశాలలో పివికి భారతరత్న, పార్లమెంట్‌లో విగ్రహం గురించి తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. అదే సందర్భంలో రాష్ట్ర అసెంబ్లీలో పివి వర్ణ చిత్రపటానిన ఆవిష్కరించాలి.రాష్ట అసెంబ్లీలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా పివి చేసిన ప్రసంగాలను పుస్తక రూపంలో ముద్రించాలి.

పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలకై ప్రత్యేక వెబ్‌సైట్
కాగా, కమిటీ సభ్యులందరి సమక్షంలో చైర్మన్ కె.కేశవరావు పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలపై రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్ pvnr.telangana.gov.in ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌లో పివి నరసింహారావు అరుదైన ఫోటోగ్యాలరీతో పాటు ఆయన రాసిన పుస్తకాలు, ఆయనపై రాసిన పుస్తకాలు, వ్యాసాలు, శతజయంతి ఉత్సవ కమిటీ సమావేశాల సమాచారం, వివరాలు, అరుదైన వీడియోలు అందుబాటులో ఉంచారు.  ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్‌తో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షలు బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, పివి కుటుంబసభ్యులు పివి వాణిదేవి, ప్రభాకర్‌రావు, దేవులపల్లి ప్రభాకర్‌రావు, దేశపతి శ్రీనివాస్, ప్రభుత్వ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, ఐఏఎస్., ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాసరాజు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఐటి డైరెక్టర్ దిలీప్ కొణతల, కె.రామచంద్రమూర్తి, విదేశీ కార్యక్రమాల సమన్వయకర్త మహేష్ బీగాల, సీతారామరావు తదితరులు పాల్గొన్నారు.

PV Centenary Celebration Committee Meeting in Ravindra Bharathi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News