Monday, April 29, 2024

నా మాటలను మోడీ వక్రీకరిస్తున్నారు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: శక్తిపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ముంబైలో ఆదివారం జరిగిన ఒక ర్యాలీలో శక్తిపై పోరాడాలంటూ తాను ఇచ్చిన పిలుపును ప్రధాని మోడీ వక్రీకరిస్తున్నారని సోమవారం రాహుల్ వివరణ ఇచ్చారు. తాను మతానికి సంబంధించిన శక్తి గురించి మాట్లాడలేదని, అధర్మం, అసత్యం, అవినీతికి సంబంధించిన శక్తి గురించే చెప్పానని రాహుల్ తెలిపారు.

తాను మాట్లాడింది ప్రధాని మోడీ వేసుకున్న ముసుగుపై పోరాటం సాగించాలని తాను చెప్పానని ఆయన వివరించారు. తన మాటలు మోడీకి రుచించవని, తాను నిజాలు మాట్లాడుతున్నానని ఆయనకు తెలుసునని, అందుకే తన మాటలకు పెడర్థాలు తీయడానికి ఆయన ప్రయత్నిస్తుంటారని రాహుల్ ఆరోపించారు. తాను ప్రస్తావించిన శక్తికి మోడీ ఓ ముసుగని, తాము దానిపైనే పోరాడుతున్నామని ఆయన తెలిపారు.

ఆ శక్తే నేడు భారతదేశ గొంతును, భారతదేశ వ్యవస్థలను, సిబిఐ, ఐటి, ఎన్నికల కమిషన్, మీడియా, భారతీయ పరిశ్రమ, దేశానికి చెందిన మొత్తం రాజ్యాంగ స్వూరూపాన్ని తన కంబంధ హస్తాలలో బంధించుకుందని రాహుల్ ఆరోపించారు. అదే శక్తిని ఉపయోగించి ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ బ్యాంకులకు చెందిన వేలాది కోట్ల రూపాయల రుణాలను మాఫీచేశారని, కాని కొన్ని వేల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించలేని భారతీయ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాహుల్ తెలిపారు. అదే శక్తి భారతీయ క్రిడలలో, విమానాశ్రయాలను అప్పగించేసిందని, కాని భారతదేశ యువజనులకు మాత్రం వారి ధైర్యాన్ని దెబ్బతీసే అగ్నివీర్‌ను బహుమతిగా ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అదే శక్తికి భారతదేశ మీడియా రాత్రీపగలూ జెజేలు పలుకుతూ నిజాలను తొక్కిపెడుతోందని రాహుల్ విమర్శించారు.

అదే శక్తికి బానిసగా మారిన నరేంద్ర మోడీ ధరల పెరుగుదలను అరికట్టడం మాని పేద ప్రజలపై జిఎస్‌టి భారాన్ని మోపారని, ఆ శక్తి బలాన్ని పెంచడానికి దేశ సంపదను వేలం వేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత ఆరోపించారు. ఆ శక్తిని తాను గుర్తిస్తానని, నరేంద్ర మోడీ కూడా ఆ శక్తిని గుర్తిస్తారని రాహుల్ చెప్పారు. అది ఏ విధంగాను మతపరమైన శక్తి కాదని, అది ధర్మానికి, అవినీతికి, అసత్యానికి సంబంధించిన శక్తని ఆయన అన్నారు. ఈ కారణంగానే తాను ఆ శక్తికి వ్యతిరేకంగా గొంతు ఎత్తిన ప్రతిసారి మోడీ, ఆయన అసత్యాల యంత్రాంగం కలవరపాటుకు గురై ఆగ్రహాన్ని వెళ్లగక్కుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News