చెన్నై: రజనీకాంత్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం తాను పార్టీ పెట్టడం లేదని, రాజకీయాల్లోకి రావడంలేదని రజనీకాంత్ ప్రకటించారు. అనారోగ్యం కారణంగా పార్టీ పెట్టడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన మూడు పేజీల ప్రకటనను విడుదల చేశారు. తప్పకుండా రాజకీయాల్లో వస్తానని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తానే రాజకీయాల్లోకి రావడం లేదని, అభిమానులు క్షమించాలని ఆయన కోరారు. ఇటీవల హైబిపి సమస్యతో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. హైదరాబాద్ నుంచి ఆయన చెన్నయ్ కు వెళ్లిన తర్వాత తన సన్నిహితులతో రాజకీయాలపై చర్చించారు. సన్నిహితుల సూచన మేరకు రాజకీయాల్లోకి రావద్దని ఆయన నిర్ణయం తీసుకుని, మంగళవారం మూడు పేజీల ప్రకటనను విడుదల చేశారు. ఇదిలా ఉండగా గతంలో రజనీకి కిడ్నీ మార్పిడి జరిగింది. రాజకీయాల్లోకి వెళ్లొద్దని నాడు వైద్యులు రజనీకి సూచించారు.ఎటువంటి శారీరక, మానసిక శ్రమ తీసుకోవద్దని వైద్యులు ఆయనకు చెప్పారు. అయినప్పటికీ ఆయన మాత్రం రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో ఇటీవల ఆయన తన అభిమాన సంఘాలతో భేటీ అయ్యారు. పార్టీ విధివిధానాలపై ఆయన వారితో చర్చించారు. ఈ నెల 31న పార్టీని ప్రకటిస్తానని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఇంతలోనే హైబిపి సమస్య తలెత్తడంతో మనస్సు మార్చుకున్న రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.