అపోలో ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్
వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన డాక్టర్లు
హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. హైబిపితో బాధపడుతున్న ఆయన ఈనెల 25వ తేదిన అపోలో ఆసుపత్రి జూబ్లీహిల్స్లో చేరిన విషయం విధితమే. అయితే తన వ్యక్తిగత వైద్యుడితో పాటు అపోలో ఆసుపత్రి ప్రత్యేక వైద్యబృందం ఆయనకు రెండ్రోజుల పాటు మెరుగైన వైద్యం అందించారు. బిపిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. వివిధ రకాల చికిత్స అనంతరం బిపి లెవల్స్ సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఆదివారం మధ్యాహ్నం రజనీని డిశ్చార్జ్ చేసినట్లు అపోలో ఆసుపత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆయన చెన్నై తరలి వెళ్లినట్లు సమాచారం. అయితే వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని అపోలో వైద్యులు రజనీకి సూచించారు. అంతేగాక ఒత్తిడికి గురికాకుండా కొద్దిపాటి వ్యాయామం కూడా చేయాలన్నారు.
మరోవైపు వయసు రీత్యా రజనీకాంత్ తప్పనిసరిగా ఆరోగ్యనియమాలు పాటించాల్సిందేనని అపోలో ఎండి సంగీతారెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం హైదరాబాద్లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ ఉన్న ఉన్న రజనీకి అకస్మత్తుగా బిపి లెవల్స్ అదుపు తప్పాయి. దీంతో ఆ చిత్ర యూనిట్ హుటాహుటిన రజనీని ఈనెల 25వ తేదిన ఆసుపత్రికి తరలించారు. ఆ రోజు రాత్రి వరకుఆయనకు బిపి అదుపులోకి రాకపోవడంతో వైద్యులతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆయన వ్యక్తిగత వైద్యుడు చైన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి రజనీకి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరికి రెండ్రోజుల తర్వాత ఆయన ఆరోగ్యపరిస్థితులు మెరుగుపడటంతో తిరిగి చెన్నైకి వెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులు, సినీవర్గాలతో పాటు ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.