ఆయన మెదడుకు రక్తం తీసుకెళ్లే రక్త నాళంలో అడ్డంకులు
దాన్ని సరిచేశాం, త్వరలోనే డిశ్చార్జి అవుతారు
కావేరి హాస్పిటల్ వైద్యుల వెల్లడి
చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ గురువారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అయితే అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆయనకు చికిత్స చేస్తున్న కావేరి హాస్పిటల్ డాక్టర్లు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ‘ అక్టోబర్ 28న రజనీకాంత్ తీవ్రమైన తలనొప్పితో చెన్నై ఆళ్వార్పేటలోని కావేరి హాస్పిటల్లో చేరారు. నిపుణులైన డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బ్రెయిన్కు రక్తం సరఫరా చేసే ఓ రక్తనాళంలో అడ్డంకులు ఉన్నట్లు గుర్తించి దానికి సంబంధించి సర్జరీ చేయాలని సూచించడం జరిగింది.
ఈ సర్జరీకి సంబంధించిన ప్రక్రియ ఈ రోజు( శుక్రవారం) విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి ఇబ్బందీ లేదు. చక్కగా కోలుకుంటున్నారు. మరి కొన్ని రోజుల్లో ఆయన హాస్పిటల్నుంచి డిశ్చార్జి అవుతారు’ అని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో కావేరి హాస్పిటల్ సహవ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలియజేశారు. కాగా రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఒక ట్వీట్లో ఆకాంక్షించారు. రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తి ’ సినిమా దీపావళికి విడుదలవుతున్న విషయం తెలిసిందే.