Monday, April 29, 2024

పిఓకెను తిరిగి పొందడమే లక్ష్యం: పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Rajnath Singh warns to PAK over POK

శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లో పర్యటనలో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్( పిఓకె)పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఓకె ప్రజలపై పాకిస్థాన్ అకృత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యవసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. పిఓకెను తిరిగి స్వాధీనం చేసుకోవడమే తమ అంతిమ లక్షమని సూత్రప్రాయంగా వెల్లడించారు. పిఓకెలోని గిల్గిత్, బాల్టిస్థాన్‌లను చేరుకున్నాకే జమ్మూ, కశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాల అభివృద్ధిని సాధించినట్లవుతుందని అన్నారు.1947లో శ్రీనగర్‌లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని గురువారం నిర్వహించిన శౌర్యదివస్ కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘జమ్మూ, కశ్మీర్, అడఖ్ అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించాం. గిల్గిత్, బాల్టిస్థాన్‌లను చేరుకున్నాకే మా లక్షంనెరవేరుతుంది. పిఓకె ప్రజలపై పొరుగుదేశం అకృత్యాలకు పాల్పడుతోంది. పిఓకె ప్రజలు అనుభవిస్తున్న బాధ వారిని మాత్రమే కాదు, మనల్నికూడా బాధిస్తోంది. దాని పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు. ఉగ్రవాదం అనేది ఒక మతం కాదు. టెర్రరిస్టుల ఏకైక లక్షం భారత్’ అని రాజ్‌నాథ్ అన్నారు.

2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్370ని రద్దు చేయడంద్వారా జమ్మూ, కశ్మీర్ ప్రజలపై వివక్ష తొలగిపోయిందని ఆయన అన్నారు. ప్రధాని మోడీ హయాంలోనే ఇది సాధ్యమయిందన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత సైన్యం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. జమ్మూ, కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత భూభాగంపై జరిగిన తొలిదాడిని 1947 అక్టోబర్ 27న సైన్యం తిప్పికొట్టింది. ఈ సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లోని 1వ బెటాలియన్ అద్భుతమైన ధైర్య సాహసాలను ప్రదర్శించింది.దీన్ని పురస్కరించుకుని ఆర్మీ ఇన్‌ఫాంట్రీ డేను జరుపుకొంటుంది. మరో వైపు ఆ యుద్ధంలో వాయుసేన తొలి విమానం శ్రీనగర్‌లో ల్యాండ్ అయింది కూడా అక్టోబర్ 27నే. ఈ నేపథ్యంలో సైన్యం, వాయుసేన కలిసి శౌర్య దివస్‌ను నిర్వహిచుకొంటున్నాయి.శ్రీనగర్‌లో వాయుసేన బేస్ ఏర్పాటు చేసి ఈ రోజుకు 50 ఏళ్లు పూర్తయ్యాయి.

Rajnath Singh warns to PAK over POK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News