సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్లు కరోనా బారిన పడ్డారు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిద్దరు కూడా క్వారెంటైన్లో ఉన్నారు అనేది ఆ పుకారు సారాశం. మీడియాలో వస్తున్న వార్తలపై విఘ్నేష్ శివన్ విభిన్న శైలిలో స్పందించాడు. తామిద్దరం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నామని… తమకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ కూడా కేవలం పుకార్లే అన్నాడు. మా గురించి పుకార్లు పుట్టించే వారు జోకర్స్ అని… వారు చేస్తున్న జోక్స్ను చూసి నవ్వుకునే ఆరోగ్యాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడంటూ విఘ్నేష్ వ్యాఖ్యలు చేశాడు.
ఇక విఘ్నేష్ ఈ సందర్బంగా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను బేబీ ఫేస్ ఫిల్టర్ యాప్ ఉపయోగించి తయారు చేశారు. ఇందులో నయనతార, విఘ్నేష్ శివన్లు చిన్న పిల్లల మాదిరిగా కనిపిస్తున్నారు. ఇద్దరు కూడా చాలా ఉత్సాహంగా బేబీ షర్క్ అనే పిల్లల పాటకు ఫన్నీగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేశారు. మొత్తానికి వీరిద్దరు కూడా ఈ ఖాళీ సమయాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయడంతో పాటు తమపై వచ్చిన పుకార్లకు ఇలా ఫన్నీ వీడియోతో సమాధానం చెప్పారు. తమపై పుకార్లు పుట్టించిన వారిని జోకర్లు అంటూ విఘ్నేష్ శివన్ సంభోదించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఏడాదిలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అతి తక్కువ మంది సమక్షంలో ఒక గుడిలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు వీరు పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.