మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మని కలిసి సన్మానించి ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా దేశ్ దీపక్ వర్మకి జోగినపల్లి సంతోష్కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి వివరించడం జరిగింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం లాంటి కార్యక్రమాలు దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశం మొత్తం అమలు చేయాలని రాజ్యసభలో కోరడం తాను కూడా విన్నానని ఇలాంటి కార్యక్రమాలు దేశం మొత్తం అమలు చేయడం జరుగుతుందని అందుకు ఉదాహరణ ‘జల జీవన్ మిషన్’ పథకమే అని తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని ముఖ్యంగా రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని నగరంలో పర్యటించినప్పుడు చాలా పచ్చదనం కనిపించిందని హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి చెందుతుందని తనతో మాట్లాడినప్పుడు కొనియాడారు అని సంతోష్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, టిఆర్ఎస్ఎల్పి కార్యదర్శి రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.