ముంబయి: తనను అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చినపుడు ప్రతిఘటించినందుకు రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామిపై ముంబయి పోలీసులు బుధవారం సాయంత్రం మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపిసిలోని 353, 504, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణలపై ముంబయి పోలీసులు బుధవారం ఉదయం అర్నబ్ గోస్వామిని ఆయన నివాసంలో అరెస్టు చేశారు.
అర్నబ్, మరో ఇద్దరు వ్యక్తులు తనకు రూ. 5.40 కోట్లు బకాయి పడ్డారని, వారు బకాయిలు చెల్లించని కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొంటూ అన్వయ్ నాయక్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం అరెస్టు చేసిన అనంతరం అర్నబ్ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఇద్దరు పోలీసులు అర్నబ్పై చేయిచేసుకున్నారంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టులో ఆరోపించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్నబ్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు నెట్టివేశారని, ఆయన ఇంటిని 3 గంటల పాటు పోలీసులు దిగ్బంధించారని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Second FIR filed Against Arnab Goswami