మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల కష్టాలు చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే రాష్ట్రం ఇవాళ దొంగల పాలైందని టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డిని కలిసేందుకు మంగళవారం ములుగు ఎంఎల్ఎ సీతక్క భారీ ర్యాలీగా హైదరాబాద్ తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ములుగు నుంచి కార్యకర్తలతో ర్యాలీగా జూబ్లీహిల్స్లోని రేవంత్రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్రెడ్డి మాట్లాడారు. తెలంగాణను పట్టి పీడిస్తున్న దోపిడీ వర్గాల నుంచి విముక్తి కల్పించడం కోసం పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు గౌరవం ఉండేదని, ఇప్పుడు టిఆర్ఎస్ పాలనలో వారికి విలువ లేకుండా పోయిందని రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పిసిసి పదవి వస్తుందని నిఘా వర్గాల రిపోర్ట్ రాగానే ప్రగతి భవన్ తలుపులు తెరుచుకున్నాయంటూ ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణ తల్లిని బందీ నుంచి విడదీయడానికే సోనియాగాంధీ తనకు పిసిసి ఇచ్చిందని, తనకు పదవులపై ఆసక్తి లేదని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర నలుమూలలా తిరగాల్సి ఉందన్నారు.
అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్లో చేరాం: ఎంఎల్ఎ సీతక్క
ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవడానికే తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని ఎంఎల్ఎ సీతక్క స్పష్టం చేశారు. తాము అధికారాన్ని అనుభవించడానికి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదని ఆమె అన్నారు. పార్టీ పలుచన అయ్యేలా ఎవ్వరూ మాట్లాడొద్దని ఆమె పేర్కొన్నారు. మెజార్టీ అభిప్రాయం మేరకే రేవంత్రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడే తమకు నిజమైన సంతోషమని ఎంఎల్ఎ సీతక్క అన్నారు.
Seethakka Meets PCC Chief Revanth Reddy