మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో పోలీసులు అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని నియంత్రించే విధంగా పలు రకాలుగా పనిష్మెంట్లు విధిస్తున్నప్పటికీ కుర్రకారు మాత్రం యధేచ్ఛగా రోడ్లపైనే సంచరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. దీంతో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల నల్గొండ జిల్లా చిట్యాల మండల పోలీసులు మరింత కఠిన వైఖరిని అవలంబిస్తున్నారట. అటువంటి వారిలో మార్పు తెచ్చే విధంగా గతంలో చేసిన ప్రయత్నాలకంటే భిన్నంగా పోలీసులు వారిపట్ల వ్యవహరిస్తున్నారట. మూర్ఖంగా రోడ్లపైకి వచ్చేవారిని నిలువరించేందుకు నల్గొండ చిట్యాల పోలీసులు వినూత్న పనిష్మెంట్ను విధిస్తున్నారట. అదే సెల్ఫీ పనిష్మెంట్. నేను ఇంట్లో ఉండను..కారణం లేకుండా బయట తిరుగుతాను.. కరోనా వైరస్ను వ్యాప్తి చేస్తాను.. నేను మూర్ఖున్ని.. నేను సామాజిక శత్రువుని అన్ననినాదాలతో రాసిన బోర్డు ఎదుట నిలబెట్టి సెల్ఫీ పనిష్మెంట్ ఇస్తున్నారట. ఈ పనిష్మెంట్ ద్వారా వారిలో మార్పు దిశగా పోలీసులు యత్నిస్తున్నారట. ఇదే నిజమైతే సెల్ఫీ పనిష్మెంట్తో సిగ్గు తెచ్చుకునైనా అటువంటి వారిలో మార్పు తధ్యం కాగలదని పలువురు అంటున్నారట.