లేకపోతే ఎంపి విజయసాయిరెడ్డి చెప్పిందే నమ్ముతాం
కరోనా దెబ్బకు దేవుళ్లు మాయమైపోతుంటే ఇంకా వారిపై ఎందుకు ప్రమాణం
బిజెపి, వైసిపి పార్టీలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, మహిళా నేత పురందేశ్వరికి ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల డబ్బు అందిందని, దీనికి సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. విజయసాయిరెడ్డి ఎంపి కాబట్టి ఆయన మాటలు నమ్మాల్సి వస్తోందన్నారు. ఎంత డబ్బు పంపించారన్న విషయాన్ని బిజెపి నాయకులు ప్రకటించకపోతే, విజయసాయిరెడ్డి చెప్పిందే నమ్మాల్సి వస్తుందన్నారు. ఎంత డబ్బు పంపించారో లేదో అన్న విషయాన్ని కేంద్రంలోని బిజెపి తేల్చాల్సిన అవసరం ఉందని నారాయణ డిమాండ్ చేశారు. ఒకవేళ డబ్బు పంపకపోతే విజయసాయిరెడ్డి పై యాక్షన్ తీసుకుంటారా? లేదా? అనేది తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆ వ్యాఖ్యలు అబద్ధమని కన్నా, నిజమేనంటూ విజయసాయిరెడ్డిలు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని, ‘కరోనా’ దెబ్బకు దేవుళ్లే మాయమైపోతుంటే, ఇంకా వాళ్లను ఎందుకు తరిమేస్తున్నారంటూ నారాయణ సెటైర్లు విసిరారు.