తీవ్రంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న
పంట పొలాల్లోనే రాలిపోయిన గింజలు
150 మండలాల్లో 27,380 రైతులకు నష్టం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల, వడగండ్ల వర్షాల కు 61 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రాథమిక పంట నష్టం అంచనా నివేదికను ప్రభుత్వానికి నివేదించింది. దీని ప్రకారం ఈ నెల 3వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగిన పంట నష్టం 61 వేల ఎకరాలుగా ఉంది. ఇందులో ప్రధానంగా వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. 59 వేల ఎకరాల్లో వరి పంటకే నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి కోత సమయంలో తీ వ్ర గాలులు, వడగండ్లకు గింజలు పంట పొలాల్లో నే రాలిపోయాయి. అదే సమయంలో కోత కోసి కుప్ప పోసిన వరిధాన్యం కూడా తడిసిందని వ్యవసాయ శాఖ నివేదించింది. అయితే ఇది ఎంత మొత్తంలో ఉంటుందనేది పేర్కొనలేదు. జొన్న పంట వెయ్యి ఎకరాల్లో నష్టపోయింది. స్కేల్ ఆఫ్ రిలీఫ్ ప్రకారం ప్రాథమిక నష్టం అంచనా రూ.331 కోట్లుగా లెక్కించారు.
మహబూబ్నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, వనపర్తి, మెదక్, యదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, జనగాం, నాగర్కర్నూల్, నారాయణ్పేట, సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, మహబూబాబాద్, వరంగల్ రూరల్, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది. మొత్తం 150 మండలాల్లో 27,380 రైతులు అకాల వర్షాలకు నష్టపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు. పంట నష్టంపై పూర్తి అంచనాకు త్వరలో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే యాసంగిలో పంటల బీమా కట్టిన రైతులు ఇన్సురెన్స్ కంపెనీలకు సమాచారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచించింది.