Friday, May 10, 2024

పోటా పోటీ వేట్లు..

- Advertisement -
- Advertisement -

ముంబై : నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో అధినేత శరద్ పవార్ అన్నకొడుకు అజిత్ పవార్ ఇచ్చిన షాక్ తీవ్రస్థాయి ప్రకంపనలకు దారితీసింది. సోమవారం పార్టీ నేత శరద్ పవార్ పార్టీ నుంచి ప్రఫుల్ పటేల్‌ను, ఎంపి సునీల్ తత్కారేను తొలిగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందన వీరిని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. మరో వైపు అజిత్ పవార్, మరో ఎనమండుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చర్యలు ఆరంభించినట్లు ప్రకటించారు. తిరుగుబాట్లను, క్రమశిక్షాణా రాహిత్యాన్ని సహించేది లేదన్నారు. పార్టీలో ఇటీవలి మార్పులలో పటేల్‌కు పార్టీ నిర్వాహక అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. అయితే ప్రఫుల్ కేంద్ర మంత్రి మండలిలోకి చేరేందుకు రంగం సిద్ధం అయిందని, బిజెపి వైపు వెళ్లుతున్నారని తెలియడంతో శరద్ పవార్ స్పందించారు. ప్రఫుల్ పటేల్‌ను వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినుంచి ,పార్టీ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు దిగుతున్నందున పటేల్‌ను, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ తత్కారేను తీసివేస్తున్నట్లు శరద్ పవార్ తెలిపారు.

దీనితో చీలికలై ఇకత్వరలోనే మరింతగా చీలే పరిస్థితి ఏర్పడ్డ ఎన్‌సిపిలో జాతీయ అధ్యక్షులుగా శరద్ పవార్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన కూతురు సుప్రియా సూలేలు నిలిచారు. ఆదివారం నుంచే శరద్ పవార్ అజిత్ పవార్ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రతరం అయింది. తమదే నిజమైన ఎన్‌సిపి అని తమ బలం చాటుకుంటామని ఇరువురు పవార్‌లు తెలియచేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి జయంత్ పటేల్‌ను పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షులుగా జయంత్ పటేల్‌ను పవార్ వర్గం నియమించింది.పార్టీ ఎమ్మెల్యేలు అంతా పార్టీ విప్ అనుగుణంగా కట్టుబడి ఉండాలని ఆదేశించింది. దీనికి ప్రతిగా ప్రఫుల్ పటేల్ తన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో వ్యవహరించి సునీల్ తత్కారేనే పార్టీ రాష్ట్ర విభాగం నేతగా ప్రకటించారు. దీనిని తిప్పికొడుతూ శరద్ పవార్ ప్రఫుల్ పటేల్‌పై తొలుత వేటేశారు. ప్రస్తుత పరిణామాలతో ఎన్‌సిపిలో ఇప్పుడు అజిత్, శరద్ పవార్ వర్గాలు పోటాపోటీగా నిలిచి, సవాళ్లకు చర్యలు ప్రతిచర్యకు దిగుతున్నాయి.

సోమవారం ప్రఫుల్ బహిరంగ తిరుగుబాటు
అజిత్ , చగన్ భుజ్‌బల్‌తో కలిసి ప్రెస్‌మీట్‌కు
ఎన్‌సిపిలో బలం పెంచుకునేందుకు, తమదే పార్టీ అని చాటుకునేందుకు అజిత్ పవార్ తమ యత్నాలు తీవ్రతరం చేశారు. ముంబైలో ఆయన సోమవారం భుజ్‌బల్, ప్రఫుల్ పటేల్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ దశలోనే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతల నుంచి జయంత్ పటేల్‌ను తీసివేస్తున్నట్లు ప్రఫుల్ పటేల్ విలేకరుకు తెలిపారు.
మరో ముగ్గురు నేతలపై పవార్ వేటు
సోమవారమే ఎన్‌సిపి నుంచి ముగ్గురు పార్టీ నేతలను పార్టీ నుంచి తొలిగిస్తున్నట్లు శరద్ పవార్ తెలిపారు. డివిజనల్ ఎన్‌సిపి నేత నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా పార్టీ అధ్యక్షులు విజయ్ దేశ్‌ముఖ్‌ను , మంత్రి పదవి పొందిన శివరాజ్ గర్జేను క్రమశిక్షణా రాహిత్య చర్యలలో భాగంగా పార్టీ నుంచి తీసివేసినట్లు వెల్లడించారు.
అజిత్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయం
స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు పవార్ వర్గం పిటిషన్
పార్టీలో తిరుగుబాటుకు దిగిన అజిత్ పవార్, మరో ఎనమండుగురు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలో సభ్యత్వ అనర్హత ప్రకటించాలని శరద్ పవార్ వర్గం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఎన్‌సిపి తరఫున మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌క పిటిషన్ దాఖలు చేశారు. అజిత్ ఇతరులు ఒక్కరోజు క్రితం తిరుగబాటు క్రమంలో రాష్ట్రంలోని ఏక్‌నాథ్ షిండే సారధ్య ప్రభుత్వంలో చేరారు. ఈ దశలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రకటితులు అయిన ఎన్‌సిపి నాయకుడు జితేంద్ర అవ్హాద్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నివాసానికి వెళ్లి తమ అభ్యర్థనను అందించారు. దీనిని స్పీకర్ కార్యాలయం నిర్థారించింది. కాగా సోమవారం ఎన్‌సిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ తరఫున నోటీసులు వెలువరించారు. వారు ఏ వేదిక నుంచి కూడా తాము ఎన్‌సిపి వారిమని కానీ , దీనితో సంబంధించి ఉన్నామని కానీ తెలియచేసుకోవడాని వీల్లేదని నోటీసులలో స్పష్టం చేశారు.

పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా నియమితులు అయిన జయంత్ పాటిల్ తరఫున ఈ నోటీసులు పంపించారు. ఆదివారం రాత్రే ఈ తొమ్మండుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తీర్మానించామని , ఇక వీరు రాజ్యాంగ ప్రకారం అనర్హత వేటు పరిధిలో వస్తారని జయంత్ చెప్పారు. మరో వైపు పార్టీ పరిణామాల నడుమ ఎంపిలు ప్రఫుల్ పటేల్, తత్కారేలను ఎంపిలుగా అనర్హులుగా ప్రకటించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే సోమవారం కోరారు. ఈ మేరకు చర్యలు తీసుకోవల్సి ఉందని పార్టీ అధ్యక్షులు శరద్ పవార్‌కు బారామతి లోక్‌సభ ఎంపి అయిన సుప్రియా సూలే తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున లోక్‌సభ ఎంపి తత్కారే, రాజ్యసభ ఎంపి అయిన పటేల్‌ల ఎంపి సభ్యత్వాల అనర్హతల దిశలో చర్యలు తీసుకోవల్సిందేనని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News