న్యూయార్క్: పొగ తాగే వారిలో కరోనా వల్ల మరణించే ముప్పు 50 శాతం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ బెడ్రోస్ అథనామ్ తెలిపారు. అలాగే క్యాన్సర్, గుండె సంబందిత సమస్యలు, కరోనా వల్ల తలెత్తే శ్వాస సంబంధిత సమస్యలు వల్ల కూడా ఈ ముప్పు అధికంగా ఉంటుందని వివరించారు. పొగాకు నివారణలో భాగంగా డబ్లుహెచ్ఒ నిర్వహిస్తున్న కమిట్ టు క్విట్ అవగాహన సదస్సులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొగతాగే వారికి కరోనా ముప్పు అధికమని భారత ఆరోగ్య శాఖ ఏడాది క్రితమే హెచ్చరించడం గమనార్హం. కరోనా ముప్పుకు దూరంగా ఉండాలంటే పొగాకుకు దూరంగా ఉండడమే మేలైన మార్గంగా ఆయన సూచించారు.
పొగాకు రహిత వాతావరణాన్ని సృష్టించడం కోసం డబ్లుహెచ్ఒ చేస్తున్న కార్యక్రమంలో ప్రతి దేశం పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దీని ద్వారా ప్రజలు పొగాకును విడిచిపెట్టడానికి కావలసిన సమాచారం, మద్దతు,టూల్స్ లభిస్తాయని పేర్కొన్నారు. క్విట్ ఛాలెంజ్ పేరిట, వాట్సప్, ఫేస్బుక్, వైబర్,మీ చాట్లో కావలసిన సమాచారం అందుతుందన్నారు. పొగాకు రహిత సమాజం కోసం డబ్లుహెచ్ఒ చేస్తున్న కృషికి భారత్ నుంచి లభిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా టెడ్రోస్ ప్రస్తావించారు.ఈ సిగరెట్లు, హెటెడ్ టొబాకో ప్రాడక్ట్(హెచ్టిపి)ను నిషేధిస్తూ భారత్లో చట్టం తీసుకొచ్చినందుకుగాను ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ను ప్రత్యేకంగా అభినందించారు.
Smokers face 50% higher risk to Corona: WHO