న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద విమానాల ద్వారా రప్పించడానికి భారత్ సన్నాహాలు ప్రారంభించింది. గల్ఫ్, బ్రిటన్ నుంచి భారతీయులు ఈ పాటికే తరలివచ్చారు. రానున్న రోజుల్లో 12 దేశాల నుంచి దాదాపు 15000 మంది భారతీయులను తీసుకు వస్తారు.అమెరికాలో చిక్కుకున్న కొంతమంది భారతీయులను ఏడు విమానాల ద్వారా భారత్కు రప్పించడానికి ఎయిర్ ఇండియా సిద్ధమైంది. ఆదివారం న్యూజెర్సీ నుంచి ముంబై, అహ్మదాబాద్ లకు విమానాల ద్వారా బయలుదేరారు. మరికొందర్ని తరలించడానికి మరోఐదు విమానాలను ఏర్పాటు చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. మొదటి విమానం శాన్ఫ్రాన్సిస్కో నుంచి ముంబై, హైదరాబాద్కు శనివారం రాగా, న్యూజెర్సీ నుంచి ముంబై, అహ్మదాబాద్లకు ఆదివారం వందేభారత్ మిషన్ విమానాల ద్వారా కొందరు బయలుదేరినట్టు చెప్పారు.
ఈ నెల 14న ఢిల్లీ, హైదరాబాద్కు విమానాల ద్వారా మరికొందరు వస్తారు. ప్రయాణికులు విమానం ఎక్కే ముందు స్క్రీనింగ్ చేయించుకోవాలని కరోనా లక్షణాలు లేని వారినే అనుమతిస్తామని అధికారులు హెచ్చరించారు. భారత్కు వచ్చే వారు తక్షణం స్క్రీనింగ్ చేయించుకోవడమే కాక, ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. ఈనెల 11న న్యూజెర్సీ నుంచి రెండు, చికాగో నుంచి మరో రెండు విమానాలు ముంబై, చెన్నైకు 15న ఢిల్లీ, హైదరాబాద్ కు విమానాలు వస్తాయి. 12న వాషింగ్టన్ డిసి నుంచి ఢిల్లీ, హైదరాబాద్ లకు ఒకే ఒక్క విమానం వస్తుంది.
Stranded Indians Evacuated from US on 7 flights