మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారిని తరిమివేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న భారత్స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ స్కూల్ నిర్వహకులను భారత్సౌట్స్అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత అభినందించారు. ఆన్లైన్ సౌకర్యం ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, సౌకర్యంలేని విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభం అయిన అనంతరం తరిగి విద్యాబోధన చేయాలని అధ్యాపకులకు కవిత సూచించారు. కరోనా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లని పరిస్థితులున్న నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు అధ్యాపకులు తెలియచేయడంతో వారి ప్రయత్నాన్ని కవిత అభినందించారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్ తరగతులు నిర్వహించడం సరైన పద్ధతని కవిత పేర్కొన్నారు.
ఆన్లైన్లో తరగతులు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు అసైన్మెంట్లు ఇస్తున్న భారత్ సౌట్స్ అండ్ గైడ్స్ నిర్వహకులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనుమతులు తీసుకుని తరగతులు నిర్వహిస్తుండటం ప్రశంసనీయమన్నారు. అలాగే కరోనాను తరిమివేసేందుకు ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని కవిత సూచించారు. కరోనాతో చేస్తున్న పోరాటంలో భాగంగా సామాజిక దూరం పాటించాలని గుర్తు చేశారు. ప్రపంచంలోని దేశాలు కరోనా బారినపడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆలాంటి ఇబ్బందులు మనదేశంలో ఉత్పన్నం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె చెప్పారు. ప్రధానంగా ప్రజల ముందన్న కర్తవ్యం కరోనాను తరిమివేయడమేనని కవిత గుర్తు చేశారు. స్వీయనియంత్రణతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి కరోనాను తరిమివేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.