గవాస్కర్ జోస్యం
ముంబై: ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియాకే గెలుపు అవకాశాలున్నాయని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. ఈ సిరీస్ను భారత్ కనీసం 4.0 తేడాతో గెలుచుకుంటుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశాడు. గతంతో పోల్చితే ప్రస్తుతం టీమిండియా చాలా బలంగా మారిందన్నాడు. ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా భారత్కు ఉందన్నాడు. ఇక ఇంగ్లండ్లోని బౌన్సి పిచ్లను టీమిండియా బౌలర్లు తమకు అనుకూలంగా మార్చుకోవడం ఖాయమన్నాడు. ఇంగ్లీష్ బ్యాటింగ్ లైనప్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసే బౌలింగ్ వనరులు టీమిండియాకు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయన్నాడు. ఆతిథ్య జట్టు బౌలర్లకంటే టీమిండియా బౌలర్లే ఈ పిచ్లను చక్కగా ఉపయోగించుకునే అవకాశం ఉందన్నాడు.
ఇక ఇంగ్లండ్కు భారత్తో పోరు ఒక సవాలు వంటిదేనన్నాడు. సొంత గడ్డపై ఆడుతున్నా ఆతిథ్య జట్టుకు పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా కనిపించడం లేదన్నాడు. కొంత కాలంగా టీమిండియా నిలకడైన విజయాలు సాధిస్తుందన్న విషయం గవాస్కర్ గుర్తు చేశాడు. ప్రతికూల వాతావరణంలోనూ చివరి వరకు పోరాడుతూ చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకుంటుండడంతో టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్ సిరీస్ను విరాట్ సేన క్లీన్స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.