Sunday, May 12, 2024

మహిళాభివృద్ధికి తోడ్పడుదాం…హింసలేని సమాజాన్ని నిర్మిద్దాం

- Advertisement -
- Advertisement -

మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి


మన తెలంగాణ / హైదరాబాద్ : ఆడ, మగ అంటూ భేదాభిప్రాయంతో పిల్లలను పెంచకూడదని, సమాన హక్కు కల్పిస్తూ పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లకా్ష్మరెడ్డి అన్నారు. హైచ్‌ఐసిసిలో ఫాగ్సి చైర్ పర్సన్ శాంతా కుమారి అధ్యక్షతన జరిగిన అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజి నవీకరణలపై గ్లోబల్ కాన్ఫరెన్స్‌ను సునీతా లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, శిశువులకు సరైన పోషకాహారం అందజేసి సోషకాహార లోపాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తోందని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా హరీష్‌రావు బాధ్యతలు స్వీకరించాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని, కెసిఆర్ కిట్స్ పంపిణీ, ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులు కల్పించడంలో ప్రత్యేక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు.

ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తూ వారికి సమాన హక్కులు కల్పిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షి టీమ్స్, భరోసా సెంటర్స్, సఖి సెంటర్స్ ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని గుర్తు చేశారు. కమిషన్ మహిళలకు రక్షణ, హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు అండగా నిలుస్తుందన్నారు.

గర్భిణీలు ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళడం, ప్రసవానంతరం ఇంటికి చేరుకోవడం కోసం ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద ప్రత్యేక వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిందన్నారు. సురక్షిత ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరేవారికి కెసిఆర్ కిట్లు అందిస్తున్నదని అబ్బాయి పుడితే రూ.12 వేలు, అమ్మాయి పుడితే రూ. 13 వేలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాళోజి నారాయణ రావు యూనివర్శిటి ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్సలర్ డా.బి. కరుణాకర్ రెడ్డి, మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News