రిడ్జిబ్యాక్ మెర్క్ సంయుక్తంగా అభివృద్ధి
న్యూఢిల్లీ : కొవిడ్ 19 చికిత్సకు త్వరలో ట్యాబ్లెట్లు కొత్తగా అందుబాటు లోకి రానున్నాయి. రిడ్జిబ్యాక్ బయోథెరప్యూటిక్మెర్స్ అండ్కో సంయుక్తంగా మోల్సుపిరావిర్ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఔషధంపై ఇప్పటివరకు చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు అందించాయి. ఐదు రోజుల పాటు ఈ ఔషధాలతో చికిత్స చేస్తే వైరస్ లోడు చెప్పుకోతగినంతగా తగ్గి పోయిందని ఇన్ఫెక్షియస్ డిసీజ్ సైంటిస్టుల వర్చువల్ సమావేశంలో రిడ్జిబ్యాక్ వెల్లడించింది. గతంలో ఫ్లూ పై టామీ ఫ్లూ ఏ విధంగా పనిచేసిందో అలాగే ఇప్పుడు మోల్సుపిరావిర్ కూడా కరోనా పై పనిచేస్తుందని ఆశిస్తున్నారు. సాధారణ ఔషధాల వలే మోల్సుపిరావిర్, సార్స్ కొవి 2 స్పైక్ ప్రొటీన్పై పనిచేయదు, అయితే నేరుగా వైరస్ ఉత్పత్తిని తగ్గించేలా ఒక ప్రత్యేకమైన ప్రొటీన్పై ప్రభావం చూపిస్తుంది. రెండో దశ ప్రయోగాల్లో మొత్తం 182 మందిపై దీన్ని ప్రయోగించగా, ఐదు రోజుల తరువాత వైరస్ జాడ వారిలో కనిపించలేదని రిడ్జ్బ్యాక్ వెల్లడించింది. ఈ ఔషధం కరోనా వైరస్ శరీరంలో పునరుత్పత్తి చేయకుండా అడ్డుకుంటుందని వివరించింది.