న్యూఢిల్లీ : కొవిడ్ 19 సెకండ్ వేవ్ను నియంత్రణలో భాగంగా వాక్సినేషన్ను ప్రోత్సహించేందుకు కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు కొత్త విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాక్సిన్ డోస్లను ఎవరైతే తీసుకుంటారో? వారికి ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డి)పై అధిక వడ్డీ రేటును ఇస్తామని ప్రకటిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాక్సిన్ అందరూ వేసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి తమ వంతుగా బ్యాంకులు కూడా ఈ ప్రచారంలో పాలుపంచుకుంటున్నాయి. వాక్సిన్లు వేసుకున్న వారికి ఎఫ్డిపై ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని చాలా బ్యాంకులు ప్రకటించాయి. ఈ ఆఫర్ కొంత కాలం మాత్రమే ఉంది. వాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారికి 999 రోజులు ఎఫ్డి చేస్తే వారికి అదనంగా 30 బేసిస్ పాయింట్లు వడ్డీ ఇస్తామని యుకో బ్యాంక్ ప్రకటించింది.
ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని పేర్కొంది. ఇక సెంట్రల్ బ్యాంక్ ఇటీవల ‘ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్’ను ప్రారంభించింది. ఈ బ్యాంక్ 1,111 రోజుల ఎఫ్డిలపై 25 అదనపు బేసిస్ పాయింట్ల వడ్డీని అందిస్తోంది. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాక్సిన్ను ప్రోత్సహించడానికి ’ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ పథకాన్ని ప్రారంభించినట్టు బ్యాంక్ ట్వీట్టర్లో ప్రకటించింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 23.59 కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకున్నారు.