Thursday, May 16, 2024

భారీ వర్షాల ఎఫెక్ట్… టమాట@ రూ. 250

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వర్షాల ఎఫెక్ట్‌తో తెలంగాణలో టమాట ధరలు భగ్గుమంటున్నాయి. తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం కిలో టమాట ధర రూ.200 కి చేరుకుంది. త్వరలోనే కిలో టమాట రూ.250 వరకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని వ్యాపారులు అంటున్నారు. గత వారం రూ.140గా ఉన్న టమాట ధర ఇప్పుడు రూ.200కి చేరింది. ఏ కూరగాయలో అయినా సరే ఈజీగా ఇమిడిపోయే మరో కూరగాయ ఏదైనా ఉంది అంటే అది టమాటా మాత్రమే. గత కొద్ది రోజులుగా టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య ప్రజలకు అందకుండా కొనుగోలుదారుని నెత్తిన గుది బండలా తయారయ్యింది. పండిస్తున్న రైతులను కోటీశ్వరులను చేస్తున్న ఈ టమాటా రేటు ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుందనుకుంటే..మరోసారి టమాటా రేటు అమాంతం పెరిగిపోయింది.

ఇటీవల తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమాటా ధర హైదరాబాద్ నగరంలో ఒకేసారి పెరిగిపోయింది. మొన్నటి వరకు 160 నుంచి 180 వరకు ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. అంతటితో ఆగుతుందా అంటే సమస్యే లేదు ఈ వర్షాల వల్ల గణనీయంగా పంటలు దెబ్బతినటంతో.. మరింత పెరిగినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు. విపరీతంగా పెరుగుతున్న టమాటా రేట్ల వల్ల నగరవాసులు అసలు టమాటా ఊసే ఎత్తడం లేదు. దీంతో విక్రయాల పరిమాణం కూడా బాగా తగ్గిపోయింది. ధర పెరగక ముందే విక్రేతలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఆ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు భారీ నష్టం వాటిల్లుతుంది. దీంతో అక్కడి నుంచి కూడా టమాటాలు రాక కొరత ఏర్పడింది. ఇప్పుడు, హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలలో టమోటాలు పంజాబ్ నుండి దిగుమతి అవుతున్నాయి. ఇప్పటికే చాలా రెస్టారెంట్లు, హోటళ్లు టమాటా వాడకాన్ని బాగా తగ్గించాయి. ఇతర తినుబండారాల్లో కూడా టమాటా ఇవ్వలేం అంటూ కొన్ని ప్రముఖ సంస్థలు ప్రకటించాయి.

ఒక్కసారిగా కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో కిలో కొనేవారు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. పెరుగుతున్న ధరల వల్ల కూరగాయలు కొనలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పుడేమో వర్షాల వల్ల పంటలు పాడైతే , అంతకు ముందు ఎండల వల్ల పంటలు నాశనం అయ్యాయి. ఒక్క టమాట మాత్రమే కాదు ఇతరకూరగాయల ధరలు కూడా పెరిగాయి. పచ్చి మిర్చి ధర రూ.160 కి చేరుకోగా బీరకాయ, వంకాయ లాంటి కూరగాయలు సెంచరీ దాటాయి. టమాట ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరలకే వీటిని అమ్ముతున్న సంగతి తెలిసిందే. నేషనల్ కోఆపరేటీవ్ కన్స్యూమర్ ఫెడరేషన్ భారీగా టమాటల్ని సేకరించి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కిలో రూ.70 కే టమాటల్ని అమ్మింది. ఎన్‌సిసిఎఫ్ ఆన్‌లైన్‌లో కూడా కిలో రూ.70 చొప్పున టమాటల్ని అమ్మింది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం రూ.70 కే టమాటల్ని అమ్మింది. ఐదు రోజుల్లో 10,000 కిలోల టమాటల్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా అమ్మడం విశేషం. అంటే రోజుకు 2,000 కిలోల టమాటల్ని సబ్సిడీ ధరకే ఎన్‌సిసిఎఫ్‌అమ్మింది. చికెన్ కన్నా టమాట ధర ఎక్కువగా ఉండటం సామాన్యులకు షాకిస్తోంది. ఆగస్ట్ చివరి వరకు టమాట ధరలు అదుపులోకి రావని భావిస్తున్నారు. కొత్త పంట వస్తే తప్ప టమాట ధరలు దిగొచ్చే పరిస్థితి కనిపించట్లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News