హైదరాబాద్: నగరంలో మరోసారి పోలీసులు భారీ మొత్తంలో హవాలా డబ్బులు పట్టుకున్నారు. కోటి రూపాయలు ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న ఇద్దరిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిద్దిపేట, ప్రశాంత్నగర్కు చెందిన సురభి శ్రీనివాస రావు నగరంలోని చందానగర్లో ఉంటున్నాడు. పటాన్ చెరువులో ఎ టు జడ్ సొల్యూషన్ పేరుతో టెక్నికల్ మ్యాన్పవర్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు.
చందానగర్కు చెందిన రవికుమార్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజేపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావుకు సొంత బావమరిది. ఇద్దరు కలిసి బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీ కార్యాలయంలో మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి మేనేజర్ వద్ద నుంచి రూ.100,00,000 తీసుకుని వెళ్తుండగా బేగంపేట ఫ్లై ఓవర్ కింద నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దుబ్బాక ఎన్నికల్లో ఓటర్లుకు డబ్బులు పంచేందుకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. డబ్బులు తరలిస్తున్న ఇద్దరిని కేసు దర్యాప్తు కోసం బేగంపేట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీనివాసరావు, ఎండి తకియుద్దిన్ తదితరులు పట్టుకున్నారు.
task force police seized Rs 1 crore cash